షాకింగ్ : భారత్ లో కరోనా మరణాల సంఖ్య ఫేక్ ? ఆరురెట్లు ఎక్కువగా
భారత్ లో కరోనా మరణాలు ఎన్ని అనే దానిపై ముందు నుంచీ గణాంకాలు తప్పుల తడకగానే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో వైరస్ సహా వివిధ కారణాలతో చనిపోయిన వారిని లెక్కించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. పలు సందర్భంగా కరోనా మరణాల సంఖ్య తప్పు అని అన్న వారిపై ప్రభుత్వం ఎదురుదాడికి కూడా దిగింది. కానీ ఇప్పుడు అదే నిజమని తేలుతోంది.
భారతదేశం యొక్క వాస్తవ కోవిడ్ -19 మరణాల సంఖ్య అధికారులు ప్రకటించిన, వివిధ రూపాల్లో బయటపడిన దాని కంటే ఆరు రెట్లు ఎక్కువ కావచ్చని తాజాగా తేలింది. తాజాగా ఓ సైన్స్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం భారత్ లో కోవిడ్ మరణాల సంఖ్య 3.2 మిలియన్లుగా అంచనా వేసింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 483,178 కోవిడ్ -19 మరణాలు అధికారికంగా నమోదు చేశారు. ఇప్పుడు బయటపడిన సంఖ్య దీని కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
గత సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య దాదాపు 71% కోవిడ్ మరణాలు సంభవించాయి. గణాంకాల పరంగా చూస్తే 2.7 మిలియన్ల మరణాలు సంభవించాయి, డెల్టా వేవ్ దేశం వ్యాప్తంగా విధ్వంసం చేస్తున్నప్పుడు, పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. వాస్తవానికి, ఈ కాలంలో, కోవిడ్ అన్ని కారణాల మరణాలను రెట్టింపు చేసే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.
భారత్ యొక్క అధికారిక సంచిత కోవిడ్ మరణాల సంఖ్య 0.48 మిలియన్లు కాగా... కోవిడ్ మరణాల రేటు సుమారు మిలియన్ జనాభాకు 345గా తేలింది. ఇది యూఎస్ మరణాల రేటులో ఏడవ వంతు. కోవిడ్ మరణాల యొక్క అసంపూర్ణ ధృవీకరణ, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలను తప్పుగా లెక్కించడం, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మరణాలు రికార్డుల్లోకి రాకపోవడం వంటి కారణాలతో ఈ సంఖ్యలో ఇంత వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.