పాఠశాల ట్రస్టీ కీచక అవతారం, నర్సరీ విద్యార్థినిపై అఘాయిత్యం, మరో బాలికతో యూరప్ టూర్
విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాల వ్యవస్థాపకుడే విద్యార్థినుల పాలిట కీచకుడిగా మారాడు. తన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులపైనే అత్యాచార పర్వానికి తెగబడ్డాడు.
ముంబై: విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాల వ్యవస్థాపకుడే విద్యార్థినుల పాలిట కీచకుడిగా మారాడు. తన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులపైనే అత్యాచార పర్వానికి తెగబడ్డాడు. చివరికి మూడేళ్ల బాలికను కూడా వదల్లేదంటే.. వీడెంతటి కామాంధుడో అర్థం చేసుకోవచ్చు.
ముంబయి అంధేరీలోని ఓ ప్రముఖ వెస్ట్రన్ సబర్బ్ పాఠశాల వ్యవస్థాపక ట్రస్టీ(57) కీచక పర్వం ఇది. ఇతడు తన పాఠశాలలో పనిచేసే ఓ నర్సరీ టీచర్ సహకారంతో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని తేలడంతో దీనిపై మహారాష్ట్ర బాలల హక్కుల కమిషన్ దృష్టి సారించింది.
రాత్రి ఆలస్యంగా ఇంటికి!.. 'గ్యాంగ్ రేప్'పై బాలిక ట్విస్ట్.. పోలీసులు ఏం తేల్చారు?
నిజానికి ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత ఏడాది చివరలో పాఠశాల ట్రస్టీ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీయడంతో ఈ అఘాయిత్యం బయటికొచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దీంతో మే 18న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. అదే పాఠశాలలో చదువుతున్న ఓ మూడేళ్ల బాలుడిపై కూడా పాఠశాల ట్రస్టీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
అంతేకాదు, ఈ స్కూలు ట్రస్టీ తన స్కూలులో 12వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయితో కలిసి యూరప్ దేశ పర్యటనకు వెళ్లాడు. ఇలా పలువురు బాలికలపై ట్రస్టీనే అత్యాచారాలకు పాల్పడ్డాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
ట్రస్టీపై రేప్ కేసు నమోదైన నేపథ్యంలో.. 12వ తరగతి చదువుతున్న అమ్మాయి యూరప్ పర్యటన నుంచి తిరిగివచ్చినా ట్రస్టీ మాత్రం రాలేదు. దీంతో అత్యాచారం కేసుల్లో నిందితుడిని యూరప్ నుంచి ముంబయికు రప్పించేందుకు బాలల హక్కుల కమిషన్ యత్నాలు ఆరంభించింది.
అక్కడి భారత రాయబార కార్యాలయం సహాయంతో నిందితుడిని తిరిగి దేశానికి రప్పిస్తామని బాలల హక్కుల కమిషన్ కార్యదర్శి త్రిపాఠి చెప్పారు. స్కూలులో భవిష్యత్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బాలల హక్కుల కమిషన్ పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించింది.
మొత్తంమీద పాఠశాలలో పలువురు టీచర్లతోపాటు ముక్కుపచ్చలారని విద్యార్థినులపై పాఠశాల వ్యవస్థాపకుడే అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపుతోంది.