ఫ్లిప్కార్ట్కు రిజైన్: ఉద్యోగులకు ముఖేష్ గుడ్బై లేఖ
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు వైదొలిగారు. వాణిజ్య, వ్యాపార ప్రకటనల చీఫ్ ముఖేష్ బన్సల్ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నా ముఖేష్ సలహాదారుగా కొనసాగుతారని ఫ్లిప్కార్ట్ తెలిపింది.
ఫ్లిప్కార్ట్ వాణిజ్య, వ్యాపార ప్రకటనల విభాగం అధిపదిగా ఉన్న ముఖేష్ బన్సాల్ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ముఖేష్... సంస్థలోని అందరు ఉద్యోగులకూ మెయిల్ రూపంలో తెలియజేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తొలుత 'మైంత్ర'లో, ఆపై ఫ్లిప్కార్ట్లో తన ప్రయాణం ఎంతో సాఫీగా సాగిందన్నారు. ఇక్కడి ఉద్యోగులు అంకితభావంతో విధులను నిర్వర్తించారన్నారు. అయితే, తాను ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశానన్న విషయాన్ని, ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్న విషయాలను మాత్రం ముఖేష్ వెల్లడించలేదు.
కాగా, ఫ్లిప్కార్ట్ కొత్త చీఫ్గా బిన్నీ బన్సాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సచిన్ బన్సాల్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. మరో రెండు నెలల పాటు ముఖేష్ సంస్థతోనే కొనసాగుతారని, తదుపరి తన స్థానంలో వచ్చే వ్యక్తికి అన్ని బాధ్యతలూ దగ్గరుండి అప్పగించిన తర్వాత వెళ్తారని తెలుస్తోంది. మరోవైపు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సెలవుల పైన వెళ్లారు.