దేశవ్యాప్తంగా ఎన్సార్సీ ఉద్దేశం లేదు- కేంద్రం క్లారిటీ- నిర్భంద కేంద్రాలు రాష్ట్రాల పనే
దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక అమలుతో పాటు జాతీయ పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో కేంద్రం ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చింది. పార్లమెంటులో దీనిపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ ఇచ్చిన క్లారిటీతో దేశవ్యాప్తంగా పౌరుల్లో ఉన్న ఓ భయం తొలగించినట్లయింది. దీంతో కేంద్రం నిర్ణయాలపై ఉన్న అనుమానాలు కూడా తొలగిపోనున్నాయి.
దేశంలో ప్రస్తుతం కేంద్రం అమలు చేయబోతున్న జాతీయ పౌర పట్టికతో పాటు 1955 నాటికి పౌరసత్వ చట్టం సవరణలోనూ నిర్బంధ కేంద్రాల అమలుకు అవకాశం లేదని కేంద్ర హోంశాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు. ఇప్పటికే అస్సాంలో ఎన్సార్సీ అమలు సందర్భంగా ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వెసులుబాటు కోసం పెట్టుకున్నవే అని ఆయన తెలిపారు.

చట్టాల్లో లేకున్నా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వెసులుబాటు మేరకు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నట్లు కేంద్రం రాజ్యసభకు చెప్పినట్లయింది. ఎన్సార్సీ అమలులో తగిన పత్రాలు లేని వారిని వారి స్వస్ధలాలకు పంపే లోపు ఈ నిర్భంద కేంద్రాల్లో ఉంచుతున్నట్లు రాజ్యసభకు హోంశాఖ తెలిపింది. అంతే తప్ప వీటిలో ఎలాంటి నిర్భందం కొనసాగడం లేదని వెల్లడించింది. మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో హోంశాఖ దేశవ్యాప్తంగా ఎన్సార్సీని అమలు చేసే ఉద్దశం లేదని తెలిపింది. సరైన పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న విదేశీయులు తమ జైలు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత వారి స్ధలాలకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని హోంశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications