కథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలు
జమ్మూకశ్మీర్: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్నారి అన్న కనీస మానవత్వం కూడా లేకుండా రోజుల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన తీరు అత్యంత పాశవికం.
Recommended Video
కథువా చిన్నారి.. మరో నిర్భయ?: ఆత్మరక్షణలో బీజేపీ!, స్మృతీ నోరు విప్పరా..
చిన్నారి హత్యతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నవేళ.. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమె తండ్రి జాతీయ మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. కన్నీటిపర్యంతమవుతూ తమ చిన్నారిని పొట్టనబెట్టుకోవడంపై ఆయన విలపించారు.
కుడి-ఎడమ కూడా తెలియని చిన్నారిపై:
'కుడి ఏదో, ఎడమ ఏదో కూడా ఇంకా తెలుసుకోలేని పసితనం ఆ చిన్నారిది. అలాంటి దానికి హిందు, ముస్లిం అన్న ఆలోచన అసలు ఉంటుందా?' అని చిన్నారి తండ్రి కంటతడి పెట్టుకుంటూ ప్రశ్నించారు.
'వాళ్లకు ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించి ఉంటే.. ఆ పసిదాన్ని కాకుండా ఇంకెవరినైనా ఎంచుకోవాల్సింది. తన కాళ్లు, చేతుల్లో ఏది ఎడమదో.. ఏది కుడిదో కూడా చెప్పలేని ఆ చిన్నారికి.. ఎవరు హిందు?, ఎవరు ముస్లిం? అన్న ఆలోచన మాత్రం ఎందుకుంటుంది?' అని ఆయన ప్రశ్నించారు.
ఈ చిన్నారిని దత్తత తీసుకున్నారు:
చనిపోయిన చిన్నారి తన తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో అందరి కన్నా చిన్నది. ఆమె ఇద్దరు సోదరులు.. ఒకరు 11వ తరగతి, మరొకరు 6వ తరగతి చదువుతున్నారు. కథువా గ్రామానికి వచ్చినప్పుడల్లా.. వారు చుట్టుపక్కల ఉన్న స్కూళ్లకు వెళ్లి చదువుకుంటూ ఉంటారు.
కాగా, అప్పటికే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తండ్రి.. ఈ చిన్నారిని తన సోదరి నుంచి దత్తతకు తీసుకున్నాడు. ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు సోదరి వద్ద నుంచి తీసుకొచ్చాడు.
తల్లికి తోడుగా ఉంటూ..:
చిన్నారి కుటుంబం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒక తెగ. బతుకుదెరువు కోసం వీరు సంచార జీవితాన్ని గడుపుతారు. ఒక్కోసారి ఇంటి పెద్ద.. ఇంటికి దూరంగా చాలాకాలం ఉండాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఇంటి వద్ద తల్లికి తోడుగా ఉంటుందని ఈ చిన్నారిని దత్తతకు తీసుకున్నట్టు ఆమె తండ్రి తెలిపారు. ఇంటి పనుల్లో సహాయం చేయడమే కాకుండా, పశువులను గుర్రాలను మేపుతూ బిడ్డ తమ కుటుంబానికి ఎంతో తోడ్పాటుగా ఉండేదని చెప్పారు.
కొత్త బట్టలు వేసుకుని సంబరపడ్డ నాలుగురోజులకే:
'జనవరి మొదటివారంలో తన తల్లితో కలిసి ఆ చిట్టితల్లి సాంబా పట్టణానికి వెళ్లింది. తమ బంధువు పెళ్లి కోసం కొత్త బట్టలు కుట్టించేందుకు తల్లి ఆమెను తీసుకెళ్లింది.
చిన్నారి ఇల్లు విడిచి వేరే చోటుకు వెళ్లడం అదే చివరిసారి. జనవరి 10న ఆమె కిడ్నాప్ కావడానికి నాలుగు రోజుల ముందు.. ఆ కొత్త బట్టలు వేసుకుని సంబరపడింది' అని ఆమె తండ్రి చెప్పారు.
స్కూల్లో చేర్పించాలనుకున్నారు:
ఈ ఏడాది వేసవికాలంలో చిన్నారిని ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఆమెనో డాక్టరో.. ఇంజనీరో చేయాలని కాదు. భవిష్యత్తులో తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థైర్యాన్ని సంపాదించుకుంటుందని. కానీ ఇంతలోనే ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని చిదిమేసింది.
ఈ మార్పు కొంతకాలం నుంచే:
'మేం నివసించే ఏరియాలో చుట్టుపక్కల హిందువులతో అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల లాగే కలిసిమెలిసి ఉంటాం. వాళ్ల ఇళ్లలో శుభకార్యాలైనా, మా ఇళ్లలో శుభకార్యాలైనా ఇరువురి ఇళ్లకు రాకపోకలు ఉంటాయి' అని చిన్నారి తండ్రి చెప్పారు. ఇప్పుడు కనిపిస్తున్న మార్పు కొద్ది సంవత్సరాల నుంచే మొదలయ్యాయి.
'నిందితులు అక్కడి ప్రజలను మాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. మేము ఆవులను జమ్మూ నుంచి కశ్మీర్ కు అక్రమంగా తరలిస్తున్నామని, డ్రగ్స్ విక్రయిస్తున్నామని, మా పశువులు వారి పంటలను నాశనం చేస్తున్నాయని, మావల్ల హిందువులకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు' అని చిన్నారి తండ్రి వెల్లడించారు.
రోడ్డుపై నడవనిచ్చేవాళ్లు కూడా కాదు..:
మాజీ రెవెన్యూ అధికారి సంజీ రామ్ రిటైర్మెంట్ తర్వాత.. ఆయన ఎప్పుడైతే గ్రామ పెద్దగా వ్యవహరించడం మొదలుపెట్టాడో తమ కుటుంబంపై వివక్ష పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఆఖరికి మేము రోడ్డుపై నడవడానికి కూడా వారు ఒప్పుకునేవారు కాదు. మా మేకలు లేదా పశువులు వారి పొలాల్లో గడ్డి మేస్తే గనుక.. ఇక అవి మాకు తిరిగి వచ్చేవి కాదు అని చెప్పుకొచ్చారు. కానీ ఇలా తమ కూతురిపై ఇంత అఘాయిత్యం ఒడిగట్టేదాకా అది వెళ్తుందని తాము ఊహించలేదన్నారు.
మా అత్యున్నత న్యాయస్థానం 'అల్లా'నే:
చిన్నారిపై అఘాయిత్యం జరిపిన గుడి పక్కనుంచే తాను రోజూ నడుచుకుంటూ వెళ్తున్నా.. అదేమి తెలియకపోవడం వల్ల ఎన్నడూ ఆ గుడిలోకి వెళ్లి చూసే ప్రయత్నం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
'మా అత్యున్నత న్యాయస్థానం అల్లా.. అక్కడ ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. విషయాన్ని మేము కోర్టుకు వదిలేశాం. ఇక అల్లా నిర్ణయించేదే అంతిమం.' అని ఆ తండ్రి వాపోయారు.