జమ్మూ కాశ్మీర్ లో పాక్ గూఢచారి అరెస్టు
శ్రీనగర్: భారత భద్రతా దళాలుకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించి ఉగ్రవాదులకు పంపిస్తున్నాడని పాకిస్థాన్ గూఢచారిని జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో భోద్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
సైనికుల కదలికలు, వారి దినచర్యలను గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి జోగిందర్ సింగ్ వెల్లడించారు. నిందితుడి నుంచి భారత సైనికుల కదలికలపై ఉన్న ఓ మ్యాప్, పాకిస్థాన్ కు చెందిన రెండు సిమ్ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
భారత నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి చాంగియా గ్రామంలో తలదాచుకున్నభోద్ రాజ్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారి జోగిందర్ సింగ్ వివరించారు. ఇతని నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని. ఎప్పటి నుంచి పాక్ కు సమాచారం అందిస్తున్నాడు అని వివరాలు సేకరిస్తున్నామని జోగిందర్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదులు అరెస్టు చేసిన భారత సైనికులు
జైష్ మహమ్మద్ (జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు పట్టుకున్నారు. గత ఆగస్టు 16వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో జరిగిన దాడి కేసులో వీరి ప్రమేయం ఉందని అధికారులు అంటున్నారు. సాహీర్ అహమ్మద్ భట్, ఫయాజ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఆగస్టు 16న జరిగిన దాడిలో ఇద్దరు సైనికులతో సహ ఓ పోలీసు మరణించాడని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి ఏకే 47 తుపాకి, రివాల్వర్, మందుగుండు సమాగ్రిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.