'కోల్గేట్'కు గండికొడుతున్న రాందేవ్ బాబా 'పతంజలి'
ముంబై: ఇటీవలే నూడుల్స్ మార్కెట్లోకి ప్రవేశించి ఆటా నూడుల్స్తో నెస్లే కంపెనీకి గండికొట్టిన రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద.. ఆ తర్వాత టూత్ పేస్ట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ఈ రంగంలో రారాజుగా ఉన్న కోల్గోట్ పామోలివ్ వాటాకు గండికొడుతోంది.
ఇప్పటికే టూత్ పేస్ట్ మార్కెట్లో 4.5 శాతం వాటాను పతంజలి ఆయుర్వేద చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని కోటక్ ఇనిస్టిట్యూట్ ఈక్విటీస్ సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో కోల్గేట్ సంస్థ తన మార్కెట్ను గణనీయంగా కోల్పోయింది.
గత ఏడాది కోల్గేట్ పామోలివ్.. తన షేర్ను 60 పాయింట్ల నుంచి (100 పాయింట్లకు) 57.3 పాయింట్లకు తగ్గింది. పతంజలి ఆయుర్వేద కారణంగా రానున్న మూడేళ్లలో కోల్గేట్ తన వాటాని నాలుగు నుంచి పదిశాతం కోల్పోవచ్చునని భావిస్తున్నారు.
'దంత కాంతి' పేరుతో ఆయుర్వేద టూత్ పేస్టును పతంజలి విడుదల చేసింది. అందులో మెడికెటెడ్, అడ్వాన్స్డ్, జూనియర్ అనే మూడు రకాలను ప్రవేశ పెట్టింది. ఇక త్వరలోనే ఫుడ్ డ్రింకులు, బేబీకర్ ఉత్పత్తులను కూడా ప్రవేశ పెట్టి ఆ రంగాల్లో ఉన్న బహుళ జాతి సంస్థల గుత్తాధిపత్యానికి గండికొట్టాలని పతంజలి భావిస్తోంది.