పూలన్దేవి హత్య: షేర్ సింగ్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: పదమూడేళ్ల నాటి సమాజ్వాది పార్టీ ఎంపి పూలన్ దేవి హత్య కేసులో షేర్ సింగ్ రానా అనే వ్యక్తిని ఢిల్లీలోని పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. భారత శిక్షాస్మృతి సెక్షన్ 302, సెక్షన్ 307 కింద రానాను దోషి నిర్ధారించినట్లు తెలిపింది.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పది మందిని కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఆగస్టు 12న రానాకు కోర్టు శిక్ష విధించనుంది. 2001 న్యూఢిల్లీలో పూలన్ దేవిని కాల్చి చంపిన రానా ఆ వెంటనే పోలీసుల ముందు లొంగిపోయాడు.
12వ నిందితుడు ప్రదీప్ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తూ గుండె పోటుకు గురై 2013, నవంబర్లో గుండెపోటుతో మృతి చెందాడు.
జులై 25, 2001లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ ఎంపి అయిన పూలన్ దేవి అశోక్ రోడ్లోని తన ఇంటి ముందు ఉన్న సమయంలో ఆమెపై కాల్పులు జరపడంతో మృతి చెందారు. కుల రాజకీయాల కారణంగానే పూలన్ దేవి హత్య జరిగిందని పోలీసులు చెప్పారు. ఆమెను హత్య చేసిన అనంతరం షేర్ సింగ్ రానా పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే 2004లో జైలు నుంచి తప్పించుకున్న షేర్ సింగ్ రానాను రెండేళ్ల తర్వాత కోల్కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు.