లోకల్ ట్రైన్ ధ్వంసం.. షాపులు, ఇళ్లలో చొరబడి లూటీ.. ఎక్కడ అంటే..?
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల జ్వల రగులుతూనే ఉంది. రోజు ఎక్కడో చోట ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్లో ఆందోళనకారులు ఏకంగా రైలును లక్ష్యంగా చేసుకున్నారు. ఇదే అనువుగా మరికొందరు కొన్ని షాపులను లూటీ చేశారు.
పశ్చిమ బెంగాల్లో గల నదియా జిల్లా బేతుఆదహరి రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్పై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లారు. ఆపై రైలుపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. దీంతో హై టెన్షన్ నెలకొంది.
ముర్షిదాబాద్లో గల శక్తిపూర్ వద్ద కూడా ఇలాంటి ఘటన జరిగింది. కొందరు ఆందోళనకారులు షాపులలోకి చొరబడ్డారు. ఇళ్లలోకి ప్రవేశించి అందినకాడికి దోచుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. జనాలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు.
ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగాల్ పోలీసులు ఇదివరకే హెచ్చరించారు. ఇప్పటికే 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు బ్లాక్ చేసిన, అల్లర్లకు పాల్పడిన, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన, మత విద్వేషాలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటున్నారు.
అల్లర్లను ప్రేరేపించేందుకు తప్పుడు కథనాలు, వీడియోలు, ఫోటోలు షేర్ చేసినా.. తప్పుడు కథనాలు షేరే చేసే వారిపై చర్యలు తీసుకుంటామని బెంగాల్ పోలీసులు స్పష్టంచేశారు. పక్షపాతం లేకుండా చట్టం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి కట్టుబడి ఉన్నామని వివరించారు.