రాహుల్ గాంధీకి కరోనా వైరస్ టెస్టులు
జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బాధిత ఇటలీ నుంచి గతవారమే ఢిల్లీకి తిరిగొచ్చిన రాహుల్.. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో వైరస్ టెస్టులు చేయించుకున్నారు. ఇటలీ నుంచి కరోనాను ఇండియాకు వ్యాపింపజేసింది రాహుల్ గాంధీనే అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలోనే టెస్టుల వ్యవహారం బయటపడింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పోలా మైనో ఇప్పటికీ ఇటలీలోనే ఉంటున్నారు. ఆమెను చూసేందుకు రాహుల్, ప్రియాంక అప్పుడప్పుడూ వెళ్లొస్తుంటారు. మూడువారాల కిందట అమ్మమ్మను కలిసేందుకు ఇటలీ వెళ్లిన రాహుల్.. ఫిబ్రవరి 29న ఇండియాకు తిరిగొచ్చారు. విదేశాల నుంచి తిరిగొచ్చేవాళ్లు.. ముఖ్యంగా కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చినవాళ్లకు ఎయిర్ పోర్టుల్లోనే విధిగా టెస్టులు చేస్తుండంతో రాహుల్ కూడా పరీక్షకు నిలబడాల్సి వచ్చింది.
జెడ్ ప్లస్ భద్రత, వీవీఐపీ హోదా ఉన్నప్పటికీ రాహుల్.. సాధారణ ప్రయాణికులతోపాటే క్యూలైన్ లో నిలబడి కరోనా టెస్టులు చేయించుకున్నారు. దాదాపు 25 నిమిషాలపాటు పరీక్షలు జరిగాయి. కాంగ్రెస్ నేతకు వైరస్ సోకలేని నిర్ధారించుకున్న తర్వాత సిబ్బంది ఆయనను వదిలేశారు. పరీక్షలు జరిపేటప్పుడు వైద్య సిబ్బందికి రాహుల్ బాగా సహకరించారని, అక్కడ డ్యూటీలో ఉన్నవాళ్లందరినీ ఆయన అభినందించారని, వైరస్ లేదని తేలడంతో వెళ్లే ముందు ధన్యవాదాలు కూడా తెలిపారని పౌర విమానయాన అధికారి ఒకరు వెల్లడించారు.
Recommended Video
ఇటలీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మరునాడే రాహుల్ గాంధీ.. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన వెంట పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా ఉన్నారు. అయితే రాహుల్ ఈశాన్య ఢిల్లీ పర్యటనపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ''ఇటలీ నుంచి వచ్చిన రాహుల్.. ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నారు. ఎయిర్ పోర్టులో టెస్టులు చేయించుకున్నదీ, లేనిదీ వెంటనే వెల్లడించాలి''అని బిధూరి అన్నారు.