చెక్కు వివాదం: కృష్ణను కలిసి రమ్య కంటతడి పెట్టారా
బెంగళూరు: మాండ్య మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీ నటి రమ్య సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాల పైన చర్చించారు. తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నాటకలో పర్యటించారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారు. రాహుల్ గాంధీ రాకకు ఒకరోజు ముందు మాండ్య నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అక్కడికి రాహుల్ గాంధీని తీసుకు వెళ్లారు. ఆ కుటుంబాన్ని రాహుల్ ఓదార్చారు. వారితో అరగంట పాటు ఉన్నారు. ఆ తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్... ఆ రైతు కుటుంబానికి చెక్కు ఇవ్వాలని అంబరీష్కు ఆదేశాలు జారీ చేశారు.
అంబరీష్ చెక్కును జెడిఎస్ ఎంపీ పుట్టరాజుకు చెక్కును ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పుట్టరాజు ప్రస్తుతం మాండ్య ఎంపీ. ఈ విషయం రమ్యకు తెలిసింది. దీంతో ఆమె అంబరీష్ పైన పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఫిర్యాదు చేసినట్లుగా వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది.
మరో వాదన కూడా వినిపిస్తోంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున బాధిత రైతు కుటుంబానికి రమ్య చెక్ అందజేసింది. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయని, ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన రమ్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే చెక్ ఇచ్చారంటూ ఆమె పైన విమర్శలు గుప్పించారు. దీంతో, ఆమె కలత చెందారట.
సోమవారం మధ్యాహ్నం ఎస్ఎం కృష్ణ నివాసానికి వెళ్లి జరుగుతున్న విషయమై ఆయనతో చెప్పారని తెలుస్తోంది. ఆయన ఎదుట ఆమె కంటతడి పెట్టారని తెలుస్తోంది. తాను ఎవరి పైనా ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
పార్టీలోని ప్రత్యర్థులు కావాలనే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బయటకు వచ్చి మాట్లాడారు. తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, తాను పదవి కోసమో, ఫిర్యాదు కోసమే రాలేదని చెప్పారు.