బీఎస్పీలోకి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్: మాయావతి ప్రకటన
మాజీ ఐపీఎస్ అధికారి, స్వేరో చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చింది. ఆరేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. టీఆర్ఎస్లోకి వెళతారనే ప్రచారం జరిగింది. కానీ అదేం జరగలేదు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బహుజనుల కోసం పోరాడుతానని స్పష్టంచేశారు. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్లే అంశం సస్పెన్స్గా మారింది. ఇటు స్వయంగా పార్టీ పెడతా అని కూడా కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.
బీఎస్పీలోకి ప్రవీణ్..
ఇంతలోనే క్లారిటీ వచ్చింది. జాతీయ పార్టీ బీఎస్పీ వైపు వెళుతున్నారని ఆయన శిబిరంలో చర్చ జరిగింది. ఆ వార్తలు నిజమని తేలిపోయింది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరతారని మాయావతి ప్రకటించారు. ఇవాళ ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. కాన్షీరాం అడుగు జాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. త్వరలో బీఎస్పీ పార్టీలో చేరతారని ఆమె ప్రకటించారు.
అంబేద్కర్ బాటలో..
అంతకుముందు తాను హుజూరాబాద్లో కొందరికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనపై వస్తోన్న ప్రచారాన్ని విశ్వసించొద్దని కోరారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. తనపై కేసులు పెట్టారని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే తాను పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని వివరించారు.
జోలికొస్తే అంతే
తనను వివాదాల జోలికి లాగకూడదని కోరారు. ఒకవేళ తనను ఎవరైనా వివాదాల్లోకి లాగితే వారి అంచనాలు తలకిందులు అవుతాయని హెచ్చరించారు. తను ఎవరినీ ఏమీ అననని.. అలాగే తన జోలికి ఎవరూ వచ్చిన చూస్తూ ఊరుకోబోనని స్పష్టంచేశారు. స్వేరో ఏర్పాటు చేసి దళిత జాతి కోసం ప్రవీణ్ కుమార్ పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన చాలా మంది ఫాలొవర్లు ఉన్నారు. ఈ క్రమంలో మాయావతి ప్రకటన చేశారు.