కోయంబత్తూరు పేలుడులో తీవ్రవాద కోణం ? నిందితుడి ఇంట్లో పేలుడు పదార్ధాల స్వాధీనం..
తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న ఓ కారులో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగిన తీరుపై విచారణ జరుపుతున్న పోలీసులు.. తీవ్రవాద సంబంధాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బాధితుడి ఇంట్లో భారీ మొత్తంలో లభించిన పేలుడు పదార్థాలే.
కోయంబత్తూర్లోని ఒక దేవాలయం సమీపంలో జరిగిన ఈ పేలుడులో జమేజా ముబిన్ మరణించాడు. 2019లో ఐసిస్ తో సంబంధాలపై ఆయన్ను కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ గతంలో ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ పేలుడులో ముబిన్ కాలి బూడిదయ్యాడు. దీంతో పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ముబిన్ నివాసం నుంచి పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్, నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఈ ఘటనకు ముందు సీసీటీవీ ఆధారాలు కూడా లభించాయి. పేలుడుకు కొన్ని గంటల ముందు ఉక్కడంలోని తన ఇంటి నుండి బాధితుడు జమేజా ముబిన్, మరికొంత మంది ఓ రహస్య వస్తువును తీసుకువెళుతున్నట్లు ఇందులో కనిపించింది. దీంతో ఉగ్రవాద సంబంధాల వ్యవహారం తెరపైకి వస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే ముబిన్ సహచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది.
అటు రాష్ట్ర బీజేపీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. సిలిండర్ పేలుడులో ఐఎస్ఐఎస్ పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. కోయంబత్తూరు సిలిండర్ పేలుడు అనేది ఇప్పుడు 'సిలిండర్ బ్లాస్ట్' కాదని, ఇది ఐసిస్ లింక్లతో కూడిన స్పష్టమైన ఉగ్రవాద చర్య అని ఆయన ట్వీట్ చేశారు. ఇది డీఎంకే ప్రభుత్వ వైఫల్యమని అన్నామలై తెలిపారు.












Click it and Unblock the Notifications