8 గంటలే పని.. కనీస వేతనం అమలు చేయకుంటే 10 లక్షల జరిమానా..!
ఢిల్లీ : కనీస వేతనం అమలుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు, సూచనలు చేసింది. అన్నిరంగాల్లో కనీస వేతనం అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోనూ ఇది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతి సంస్థ కనీస వేతన కోడ్ అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఏ సంస్థ అయినా సరే, కనీస వేతన కోడ్ అమలు చేయకుంటే 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అలాగే ఉద్యోగులతో 8 గంటలకన్నా ఎక్కువగా పనిచేయించరాదనే నిబంధన పేర్కొంది. ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా.. 8 గంటలకు మించి పని చేయించుకోవద్దని సూచించింది.
అనుభవమున్నవారికి, ఫ్రెషర్స్ కు ఒకే వేతనం ఇవ్వడం కుదరదని తేల్చింది. అనుభవం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అలాగే కనీస వేతనం అనేది ప్రతి ఐదేళ్లకోసారి సవరించాలని పేర్కొంది. కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమనేది ప్రాథమిక హక్కుగా అభివర్ణించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనీస వేతనాల అమలును బలోపేతం చేసేలా కేంద్రానికి ఊతమిస్తుందని తెలిపింది. కనీస వేతన కోడ్ అమలుకు సంబంధించి.. కార్యాచరణ భద్రత, ఆరోగ్యం (OSH)అంశంపై వారంలోగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించనుంది. దాని తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.