తమిళనాడు గవర్నర్ గా విద్యాసాగర్ రావు 13 నెలలు, ప్రత్యేక పుస్తకం, వెంకయ్య నాయుడు హాజరు !
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు 2016 సెప్టెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు 13 నెలల పాటు తమిళనాడు రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ గా పని చేశారు.
చైన్నై: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు 2016 సెప్టెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు 13 నెలల పాటు తమిళనాడు రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ గా పని చేశారు. ఆ సందర్బంలో తమిళనాడు రాజ్ భవన్ లోని సంపాదక విభాగం తమిళనాడుకు, సీహెచ్. విద్యాసాగర్ రావుకు ఉన్న అనుబంధం గురించి ఓ పుస్తకం ప్రచురించింది.
గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి పరిస్థితుల్లో తమిళనాడు వచ్చారు, 13 నెలలు రాష్ట్రానికి ఎలాంటి సేవలు అందించారు అనే పూర్తి వివరాలతో 'దోస్ ఈవెంట్ ఫుల్ డేస్'అనే పుస్తకాన్ని ప్రచురించారు. భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై చెన్నైలోని రాజ్ భవన్ లో దోస్ ఈవెంట్ ఫుల్ డేస్ పుస్తకం ఆవిష్కరించారు.
2016 సెప్టెంబర్ నెలలో సీహెచ్ విద్యాసాగర్ రావు తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ గా నియమించారు. అదే నెలలో జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. తరువాత జయలలిత మరణించడంతో సీహెచ్ విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వం తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో పన్నీర్ సెల్వం రాజీనామా చెయ్యడంతో ఎడప్పాడి పళనిసామి చేత సీహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. సీహెచ్. విద్యాసాగర్ రావు తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వర్దా వరదలు, జల్లికట్టు పోరాటం, రిసార్ట్ రాజకీయాలు తదితర పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో సీహెచ్ విద్యాసాగర్ రావు సమయస్పూర్తితో సమస్యలు పరిష్కరించడంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీహెచ్ విద్యాసాగర్ రావు తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల నాయకులు, మీడియాతో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం ఎడప్పాడి పళనిసామి తదితరులు పాల్గొన్నారు.