విద్వేష వ్యాఖ్యలు, మైనార్టీలపై దాడులు-ప్రధాని మోడీ మౌనంపై రెండు ఐఐఎంల విద్యార్ధుల లేఖ
భారత్ లో నానాటికీ పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు, మైనార్టీ వర్గాలపై దాడులపై ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ బెంగళూరు, అహ్మదాబాద్ ఐఐఎంల విద్యార్ధులు, ఫ్యాకల్టీ లేఖలు రాయడం చర్చనీయాంశమవుతోంది. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాధ్యతాయుత స్ధానంలో ఉన్న ప్రధాని మౌనంగా ఉండిపోవడాన్ని వారు తప్పుబట్టారు.
బెంగళూరు, అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన విద్యార్థులు, అధ్యాపకుల బృందం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ద్వేషపూరిత ప్రసంగాలు, మైనారిటీలపై దాడులపై ధ్వజమెత్తారు, ఆయన మౌనం ద్వేషపూరిత స్వరాలకు ధైర్యానిస్తోందంటూ వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన లేఖలో 183 మంది విద్యార్దులు, ఫ్యాకల్టీ సంతకాలు చేశారు, వీరిలో ఐఐఎం బెంగళూరులోని 13 మంది ఫ్యాకల్టీ సభ్యులు ఐఐఎం అహ్మదాబాద్కు చెందిన ముగ్గురు ఉన్నారు.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారూ.. మా దేశంలో పెరుగుతున్న అసహనంపై మీ మౌనం, మన దేశంలోని బహుళ సంస్కృతుల్ని గౌరవించే మనందరికీ నిరుత్సాన్ని కలిగిస్తోందని వారు ఆరోపించారు. మీ మౌనం ద్వేషంతో నిండిన స్వరాలకు ధైర్యాన్నిస్తుంది, మన దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మమ్మల్ని విభజించాలని చూస్తున్న శక్తుల నుంచి దేశాన్ని దూరంగా ఉంచాలని వారు ప్రధానిని కోరారు.
ఐఐఎం బెంగళూరులోని ఐదుగురు ఫ్యాకల్టీ సభ్యులు ఈ లేఖను తయారు చేశారు. వారు ప్రతీక్ రాజ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ స్ట్రాటజీ); దీపక్ మల్ఘన్ (అసోసియేట్ ప్రొఫెసర్, పబ్లిక్ పాలసీ), దల్హియా మణి (అసోసియేట్ ప్రొఫెసర్, ఎంటర్ప్రెన్యూర్షిప్); రాజ్లక్ష్మి వి మూర్తి (అసోసియేట్ ప్రొఫెసర్, డెసిషన్ సైన్సెస్); హేమా స్వామినాథన్ (అసోసియేట్ ప్రొఫెసర్, పబ్లిక్ పాలసీ). మల్ఘన్ ఒక ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్త కూడా.
బెంగుళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హిందువులను ముస్లింలు మరియు క్రిస్టియన్లుగా మార్చమని ఉద్బోధిస్తూ చేసిన వివాదాస్పద ప్రసంగం, దేశంలోని అనేక ప్రాంతాలలో చర్చిలపై ఇటీవల దాడులు, హరిద్వార్ ధరమ్ సన్సద్ లో కాషాయ గురువులు చేసిన వ్యాఖ్యలు ఈ లేఖలకు కారణమని తెలుస్తోంది.