ఎమ్మార్పీఎస్ కు వెంకయ్య మద్దతు : 'మాదిగలకు పెద్దన్న లాంటోడు వెంకయ్య'
న్యూఢిల్లీ : ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా.. ఢిల్లీలో ధర్నాకు దిగిన ఎమ్మార్పీఎస్.. కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడగట్టడంలో సఫలమవుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఎమ్మార్పీఎస్ మహాధర్నాకు సంఘీభావంగా నేడు ధర్నాస్థలికి వెళ్లిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వర్గీకరణకు మద్దతుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ సహేతుకమైనదేనని తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పంపిణీ జరిగితేనే అందరికీ సమన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లను వర్గీకరించడం ద్వారా ఎలాంటి నష్టం జరగదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారని, వారి ఎదురుచూపులకు న్యాయం జరగాల్సిందేనన్న తరహాలో వెంకయ్య వ్యాఖ్యానించారు.
మొత్తానికి మహాధర్నాతో కేంద్రం నుంచి అనుకూల సంకేతాలు వచ్చేలా చేయడంలో ఎమ్మార్పీఎస్ విజయవంతమైనట్లుగానే కనిపిస్తోంది.
వెంకయ్యదే బాధ్యత :
కేంద్రమంత్రి వెంకయ్య సహకారంతోనే జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం సాధ్యపడిందని, మాదిగ జాతి పట్ల వెంకయ్య నిర్వహించిన పాత్ర పెద్దన పాత్ర లాంటిదని అభిప్రాయపడ్డారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులుమందకృష్ణ మాదిగ.
వెంకయ్య మద్దతుపై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఇక ఎస్సీ వర్గీకరణ బాధ్యత వెంకయ్యదే అని వ్యాఖ్యానించారు. ఇది మాదిగల న్యాయబద్దమైన డిమాండ్ అని, అన్యాయం జరుగుతుంది కాబట్టే.. ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోందని తెలిపారు మందకృష్ణ.