పోలీసులు వెంటాడారు: నదిలో పడి జలసమాధి
లక్నో: పోలీసులు పట్టుకుంటారని భయంతో ఇద్దరు వ్యక్తులు నదిలో దూకి జలసమాధి అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి వాహనాలకు నిప్పంటించారు.
బుధవారం రాత్రి పోలీసులు పేకాట కేంద్రంపై దాడి చేశారు. ఆ సందర్బంలో సతీష్, దినేష్ తో పాటు పలువురు తప్పించుకునేందుకు పరుగు తీశారు. అయితే పోలీసులు వెంటాడంతో చిక్కిపోతామని భయపడిన దినేష్, సతీష్ రామ్ గంగా నదిలో దూకేశారు.
ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగి ఇద్దరూ జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఫర్నిచర్ ద్వంసం చేశారు. పోలీసులను పట్టుకుని చితకబాదేశారు.
పోలీసులకు చెందిన 12 బైక్ లతో పాటు పోలీసు కార్లు, వాహనాలకు నిప్పంటించి బూడిద చేశారు. ఈ గొడవలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న డీఐజీ అర్ కేఎస్. రాథోడ్, ఐజీ విజయ్ సింగ్ మీనా, జిల్లా ఎస్పీ ధర్మవీర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే మకాం వేశారు.
అదనపు బలగాలను రంగంలోకి దించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని డీఐజీ ఆర్ కేఎస్ రాథొడ్ అన్నారు. అయితే ఈ గొడవలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల అత్యుత్సాహం వలనే ఇద్దరి ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపించారు.