మహా సీఎం షిండే నివాసం వద్ద భారీగా వర్షపు నీరు.. రంగంలోకి రెస్క్యూ టీమ్
మహారాష్ట్రలో వర్ష బీభత్పం కొనసాగుతోంది. తేలికపాటి వానలకే ముంబై మహానగరం కూడా చిత్తడి అయిపోతుంటుంది. ఇక శివారులో గల థానే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే ఉంటుంది ఇక్కడే.. అయితే వర్షంతో సీఎం ఇంటి వరకు వర్షపు నీరు చేరింది. దీంతో అధికారులు వెంటనే నీటిని మళ్లించే ప్రయత్నాలు చేపట్టారు.
మహారాష్ట్రలో వర్షాలు..
ముంబై సహా థానే, పాల్ఘర్ తదితర జిల్లాలు కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో థానేలోని సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం వరదనీటిలో చిక్కుకుపోయింది. నివాసం చుట్టూ వరదనీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని వరదనీటిని తొలగించింది.
సీఎం ఇంటి వద్ద వర్షపు నీరు
సీఎం షిండే ఇంటి వద్దకు వర్షపునీరు చేరిందని గురువారం ఉదయం 6.15 గంటలకు స్థానిక అధికారులకు సమాచారం అందింది. వెంటనే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. మరోవైపు జిల్లాలో కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూడా నెలకొరిగాయి. సరిహద్దు జిల్లా పల్గర్లో జిల్లా పరిషత్ స్కూల్ గోడ కూలింది. అయితే ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులకు సమీపంలో గల స్కూల్లో పాఠాలు చెప్పే ఏర్పాట్లు చేశారు. శిథిలాలను తీసి వేయడానికి స్థానికులు సాయం చేశారు. కొత్త స్కూల్ భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
మరో 3 రోజులు వానలు
పుణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పంజికల్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి.
దీంతో ముగ్గురు మృతి చెందారు. ఉడుపి, బెళగావి, దక్షిణ కన్నడ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగింది. హైదరాబాద్లో నిన్నటివరకు ముసురు వేసింది. ఇవాళే కాస్త ఎండ వచ్చింది. మరో 3 నుంచి 5 రోజుల వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది.