‘హెచ్ఐవి పాజిటివ్’ అని పాఠశాల నుంచి గెంటేశారు
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థికి హెచ్ఐవి ఉండటంతో అతడ్ని పాఠశాల నుంచి గెంటేశారు. ఓ వైపు ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ.. ఓ ప్రైవేటు పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం.
పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాకు సమీప ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెచ్ఐవి పాజిటివ్ అని తేలవడంతో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నుంచి గెంటేశారు.
కాగా, తనకు, తన కుమారుడికి హెచ్ఐవి ఉన్న విషయాన్ని అంతకుముందే పాఠశాల యాజమాన్యానికి ఆ విద్యార్థి తల్లి తెలిపింది. తాను ఎయిడ్స్ వ్యాధి అవగాహన సంస్థలో పనిచేస్తున్నాననే సమాచారాన్ని కూడా ఇచ్చింది.
అయితే ముందు ఎలాంటి అభ్యంతరం చెప్పని పాఠశాల యాజమాన్యం, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి, పిల్లవాడ్ని క్లాసులకు రావద్దంటూ ఆదేశించింది. తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. బాధిత విద్యార్థిని దూషిస్తున్నా పాఠశాల యాజమాన్యం ఏమాత్రం అడ్డుకోలేదు.
ఆ విద్యార్థి పాఠశాలకు వస్తే తమ పిల్లలను పాఠశాలకు పంపించమని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ పాఠశాలకు రావద్దంటూ ఆ చిన్నారిని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది.
విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తన చర్యను పాఠశాల యాజమాన్యం సమర్ధించుకుంది. దీనిపై విద్యార్థి తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై స్పందించిన శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ.. బాధిత విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పారు. బాధిత విద్యార్థికి అన్ని రకాల సహాయం అందించాలని జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించామని తెలిపారు.