వ్యక్తిగత గోప్యత అంటే ఏమిటి?: రాజ్యాంగం ఏం చెబుతోంది?
ప్రైవసీ పేరుతో ప్రభుత్వం పౌరులపై విధించే నియంత్రణలను అడ్డుకోవడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంచేసింది.
న్యూఢిల్లీ: ప్రైవసీ పేరుతో ప్రభుత్వం పౌరులపై విధించే నియంత్రణలను అడ్డుకోవడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంచేసింది. అయితే, తాజా తీర్పులో మాత్రం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేగాక, పౌరుల వ్యక్తిగత వివరాలను బహిర్గత పర్చడం సరికాదని పేర్కొంది. పౌరుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు యంత్రాంగాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
వ్యక్తిగత గోప్యతపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, ఆధార్ లింక్పై సందిగ్ధత
కాగా, వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) అనేది ఒక నిర్ధిష్టమైన నిర్వచనం లేని పదంగా గతంలో కోర్టు అభివర్ణించింది. ప్రైవసీ ఒక హక్కు అని నిర్ధారించే ముందు దాని నిర్వచనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే అది దాదాపు అసాధ్యమని ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రైవసీని ఎలా నిర్వచిస్తాం? అందులోని విషయాలు ఏంటి? ప్రభుత్వం ప్రైవసీని ఎలా నియంత్రిస్తుంది? ఓ వ్యక్తి ప్రైవసీని రక్షించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? అని ఆధార్ చట్టాన్ని సవాలు చేసిన పిటిషనర్లను జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు.
ప్రైవసీ హక్కును నిర్వచించే ప్రయత్నం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం రాజ్యాంగం ప్రకారం.. ప్రైవసీ ఒక ప్రాథమిక హక్కా కాదా అనేదానిపై విచారణ జరిపింది.
అయితే ప్రైవసీ అనేది ఓ సాధారణ హక్కు అని, రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే దీనిని ప్రాథమిక హక్కుల జాబితాలో కలపలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ఆధార్ రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు చాలెంజ్ చేశారు. ఇప్పుడు ప్రైవసీని కోర్టు ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అంతేగాక, పౌరుల వ్యక్తిగత వివరాల గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది.
Recommended Video
పౌరులు జరిపే సమస్త లావాదేవీలకూ ప్రభుత్వాలు ఆధార్ను తప్పనిసరి చేస్తున్న తరుణంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆధార్ వివిధ అంశాలతో అనుసంధానం తప్పనిసరి ఉంటుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.
2009 జనవరిలో కేవలం పాలనాపరమైన ఒక ఉత్తర్వు ద్వారా మొదలైన ఆధార్ ఇప్పుడు అన్నింటికీ కీలకంగా మారింది. 2010లో దీనికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లును ఆ మరుసటి సంవత్సరం పార్లమెంటు స్థాయీ సంఘం తిరస్కరించాక ఇది ఆగినట్టు కనబడినా స్వల్ప కాలంలోనే చకచకా కదిలింది. పార్లమెంటులో చర్చించకుండా, దాని ఆమోదం పొందకుండా కేవలం పాలనా ఉత్తర్వుపై అమల్లోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమంటూ 2012లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఆధార్ వల్ల పౌరుల డేటా అసాంఘిక శక్తుల చేతుల్లో పడొచ్చునని, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లవచ్చునని పిటిషనర్లు వాదించారు. ఈ కేసు విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకూ పౌరులకు ఆధార్ తప్పనిసరి చేయొద్దని, ఏ సంక్షేమ పథకాన్ని వారికి నిరాకరిం చవద్దని న్యాయమూర్తులు సూచించడం... అందుకు ప్రభుత్వం అంగీకరించడం పూర్తయినా ఆధార్ దూకుడు ఆగింది లేదు. మొదట రేషన్కూ, వంటగ్యాస్కూ మినహా మరే ఇతర అంశాలకూ వర్తింపజేయొద్దని చెప్పిన సుప్రీంకోర్టు గత నెలలో పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించడం విషయంలో సానుకూలంగానే స్పందించింది.
ఆధార్ ఉన్నవారు అనుసంధానించుకోవాలని, లేనివారు ఆ పని చేయనవసరం లేదని చెప్పడం వల్ల సారాంశంలో చాలామందికి అది తప్పనిసరే అయింది. అసలు సుప్రీంకోర్టు దృష్టికి రాకుండా ఆధార్తో ముడిపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇలా సాగుతుండగానే, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడకముందే ఆధార్ బిల్లును నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం కూడా పూర్తయ్యాయి. తగిన మెజారిటీ లేని కారణంగా రాజ్యసభలో గట్టెక్కలేమనుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ద్రవ్య బిల్లుగా చూపింది.
ఆధార్ పథకం, దాని చెల్లుబాటు సంగతలా ఉంచి ఇప్పుడు అసలు వ్యక్తిగత గోప్యత ఏ రకమైన హక్కు అనే అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించబోతోంది. దీన్ని తేల్చడానికి మంగళవారం తొమ్మిదిమంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పర్చడం, అది బుధవారం నుంచే విచారణ మొదలు పెట్టింది.
గురువారం వ్యక్తిగత గోప్యత కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఇప్పుడు ఆధార్ చట్టబద్ధతను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించే అవకాశం ఉంది. కాగా, రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు గనుక అది ప్రాథమిక హక్కు కాదనడం తార్కికంగా ఆమోదయోగ్యం కాదని ధర్మాసనంలోని జస్టిస్ చలమేశ్వర్ అనడం గమనించదగ్గ విషయం.
కాగా, జీవించే హక్కంటే కేవలం ప్రాణానికి సంబంధించిన హక్కు మాత్రమే కాదని, అది గౌరవప్రదంగా జీవించే హక్కు కూడానని మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి అగ్నివేష్ నేతృత్వంలోని వెట్టి కార్మికుల విముక్తి సంస్థ కేసులో అయితే దోపిడీకి గురికాకుండా ఉండటం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య కరమైన వాతావరణంలో ఎదిగేందుకు పిల్లలకు అవకాశం కల్పించడం వగైరాలు కూడా జీవించే హక్కు పరిధిలోకే వస్తాయని తెలిపింది. అలాగే పనిచేసే స్థలాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండటం కూడా జీవించే హక్కు పరిధిలోకే వస్తుందని మరో తీర్పులో వివరించింది. రాజ్యాంగంలో పొందుపరచ లేదు గనుక వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదన్న అటార్నీ జనరల్ వాదనను అంగీకరిస్తే ఈ హక్కులన్నీ 'ప్రాథమిక హక్కు' పరిధిలోకి రాకుండా పోతాయి.
1954లో ఒకసారి, 1963లో మరోసారి ఇచ్చిన వేర్వేరు తీర్పుల్లో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పి ఉండొచ్చు. అయితే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విస్తృత కోణంలో మరోసారి ఆ తీర్పులను పరిశీలించవలసిన సమయం ఆసన్నమైంది. మొదటి కేసును 8మంది న్యాయమూర్తుల ధర్మాసనం, రెండో కేసును ఆరుగురు న్యాయమూర్తుల ధర్మా సనం పరిశీలించి తీర్పులను ఇచ్చాయి. గనుక ఇప్పుడు అంతకన్నా అధిక సంఖ్యలో న్యాయమూర్తులుండే ధర్మాసనం ఏర్పాటు అవసరమైంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా పరిగణిస్తే ఆధార్ 'సకారణమైన పరిమితి' కిందికే వస్తుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంటుంది. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.