‘నోరు మూసుకోండి’: స్వామికి బిజెపి, జైట్లీకి తలనొప్పి
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి రోజుకో తలనొప్పి తెచ్చిపెడుతున్న ఎంపీ సుబ్రమణ్యస్వామి దూకుడు కళ్లెం వేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. 'ఇక చాలు నోరు మూసుకోండి' అంటూ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ నిష్క్రమణకు పరోక్షంగా కారణం కావడం, ఆ తర్వాత ఏకంగా ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లక్ష్యంగా మాటలయుద్ధానికి దిగడంతో పార్టీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ అమెరికా కోసం పనిచేస్తున్నారని స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అంతేగాక, కేంద్రమంత్రులు సూట్ వేసుకుని, టై కట్టుకుంటే హోటళ్లలో వెయిటర్లలా ఉంటారని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలు జైట్లీనుద్దేశించేనని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత తాను జైట్లీని ఉద్దేశించి అనలేదని సుబ్రమణ్యస్వామి వివరణ ఇచ్చుకున్నారు.
ప్రతిసారి స్వామి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెబుతూ వస్తున్నా రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతుండటంతో బీజేపీకి ఇక వార్నింగ్ ఇవ్వక తప్పలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జూన్ 24న చైనా వెళ్లారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబి) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన తన షెండ్యూల్లోని సమావేశాలన్నింటినీ హడావుడిగా చేపట్టి.. ఒకరోజు ముందుగానే స్వదేశం చేశారు.
చైనా ఆర్థికమంత్రి లౌ జీవీ, చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ ఛైర్మన్ జు షావోషితో జైట్లీ నిజానికి సోమవారం సమావేశం కావాల్సి ఉంది. అయితే, ఆదివారం రాత్రే భారత్ చేరుకునే ఉద్దేశంతో ఆయన అదే రోజు ఈ ఇద్దరితో సమావేశమయ్యారు.
కాగా, జైట్లీ అర్ధంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ తిరిగి రావడానికి సుబ్రమణ్య స్వామి చేస్తున్న ఆరోపణలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. తనపై, తన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులపై ఆరోపణల దాడితో విరుచుకుపడుతున్న నేపథ్యంలో జైట్లీ తన చైనా పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర ఆరోపణలతో సొంత పార్టీలోనే ప్రకంపనలు రేపుతున్న స్వామి తీరుతో జైట్లీ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జైట్లీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన భేటీలో మాత్రం స్వామి ఆరోపణల అంశం ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.