టెక్కీలకు షాక్: హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు ఇండియాపై తీవ్ర ప్రభావం, ఎందుకంటే?
భారత్ నుండి అధిక శాతం ఐటీ సేవలు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయని హెచ్ 1 బీ వీసాల జారీలో ట్రంప్ సర్కార్ తీసుకొనే తీవ్రమైన నిర్ణయాలు భారత్ కు ఆందోళన కల్గిస్తాయని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమ
వాషింగ్టన్: భారత్ నుండి అధిక శాతం ఐటీ సేవలు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయని హెచ్ 1 బీ వీసాల జారీలో ట్రంప్ సర్కార్ తీసుకొనే తీవ్రమైన నిర్ణయాలు భారత్ కు ఆందోళన కల్గిస్తాయని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.
భారత్ నుండి ఎక్కువగా సాప్ట్ వేర్ ఎగుమతులు అమెరికా దేశానికే ఉన్నాయి.అయితే అమెరికా అధ్యక్షుడు తీసుకొంటున్న నిర్ణయాలు ఇండియాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు ఆయన స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చారు.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే అదే సమయంలో ఇప్పటికే కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకొంటున్నాయి.మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్లో కోతను విధిస్తున్నాయి.
ట్రంప్ నిర్ణయాలు ఇండియా టెక్కీలకు దెబ్బే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.భారత్ లోని మొత్తం ఎగుమత్తుల్లో సేవారంగ ఎగుమతులు 40-45 శాతం వరకు ఉన్నాయి.ఇక మొత్తం సేవల్లో 50-60 వరకూ అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి.అయితే హెచ్ 1 బీ వీసాల ఆంక్షల నేపథ్యంలో ఇండియాలోని ఐటీ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.హెచ్ 1 బీ వీసాపై ఆంక్షలు భారత్ పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ చెప్పారు.
కొత్త వీసాల డిమాండ్ ను పరిశీలిస్తామన్న అమెరికా
భారత్ కు కొత్తగా వీసాలు కావాలంటే దానిని పరిగణనలోకి తీసుకొంటామని అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలిక కార్యదర్శి మార్క్ టోనర్ చెప్పారు. భారత్ -అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటీకి పటిస్టంగా ఉండాలని కోరుకొంటున్నట్టు ఆయన చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్న భారత కంపెనీలకు తాము అమితమైన గౌరవం ఇస్తామన్నారు. అవి తమ దేశంలో అనేక ఉద్యోగాలు సృష్టిస్తున్నాయన్నారు. ఈ గౌరవంతో వాటికి కొత్తగా వీసాలు కావాలంటే దానిని పరిగణనలోకి తీసుకొంటామన్నారు.
అమెరికావి తప్పుడు ఆరోపణలు
హెచ్ 1 బీ వీసాల్లో సింహాభాగం భారతీయ కంపెనీలకు దక్కుతాయన్న అమెరికా ఆరోపణల్ని నాస్కామ్ తోసిపుచ్చింది. టీసీఎస్, ఇన్పోసిస్ లను సమర్థిస్తూ 2014-15 లో హెచ్ 1 బీ వీసాల్లో కేవలం 8.8 శాతం (7504) మాత్రమేనని నాస్కామ్ తేల్చి చెప్పింది. ఈ రెండు సంస్థలకు దక్కిన విషయాన్ని నాస్కామ్ గుర్తు చేసింది. ఖాతాదారుల కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల్ని పంపేందుకు మాత్రమే ఈ వీసాల్ని వాడుతున్న విషయాన్ని నాస్కామ్ ప్రస్తావించింది.
రుణమాఫీతో జీడీపీ లోటు
దేశంలో ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొన్న రుణమాఫీ నిర్ణయంపై ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ విధానం దేశమంతా అమలైతే దేశ జీడీపీలోటు రెండు శాతం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇటీవలే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధన్ 36 వేల కోట్ల వ్యవసాయ రుణాల్ని మాఫీ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.