మోడీ-పెన్స్ల భేటీ: H-1B వీసా నిర్ణయాన్ని ట్రంప్ పునఃసమీక్షిస్తారా.. ?
సింగపూర్ : హెచ్-1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పునఃసమీక్షించాలని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. సింగపూర్లో ఓ సమావేశం కోసం వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పెన్స్తో భేటీ అయ్యారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యం ఉందని ఇక్కడి ఐటీ నిపుణులు అమెరికా వృద్ధి చెందడంలో కృషిచేస్తున్నారని మోడీ తెలిపినట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.
భారతీయ ఐటీ కంపెనీలకు పెద్ద దెబ్బ
తూర్పు ఆసియా దేశాల సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్లు సమావేశానికంటే ముందు భారత్ అమెరికా దేశాలకు సంబంధించి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్లో దీపావళి వేడుకలు నిర్వహించడంపై భారత ప్రధాని డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ పాలన బాగుందంటూ కితాబిచ్చారు. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మైక్ పెన్స్ను కోరారు మోడీ.
అమెరికా ఆర్థిక అభివృద్ధిలో భారతీయుల పాత్ర
అమెరికాలో సెటిల్ అయిన భారతీయులు భారత్ నుంచి ప్రజాస్వామ్య విలువలతో పాటు నైపుణ్యాన్ని వెంట తెచ్చుకున్నారని ఇప్పుడు అమెరికా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. అంతేకాదు అమెరికా రాజకీయాల్లో, సామాజిక అంశాల్లో భారతీయులు మంచి పాత్ర పోషిస్తున్నారని మోడీ పెన్స్కు తెలిపినట్లు విజయ్ గోఖలే చెప్పారు.ఈ క్రమంలోనే హెచ్ -1 బీ వీసాలపై కాస్త సడలింపు ఇవ్వాలని మైక్ పెన్స్కు మోడీ విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
హెచ్-1బీ వీసా సవరణలు చేయాలని చట్టసభల్లో ఏడు బిల్లులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అమెరికా ఫస్ట్ నినాదంతో వెళ్లిన ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఇదే క్రమంలో ఆయన పాలనాపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమెరికాలో ఉండి పనిచేస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాదు ముఖ్యంగా ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే అమెరికా కాంగ్రెస్ మరియు సెనేటర్లు అమెరికా చట్ట సభల్లో హెచ్-1 బీ వీసాలపై పలు సవరణలు చేయాల్సిందిగా ఏడు బిల్లులను తీసుకొచ్చారు.అయితే ఇప్పటికీ ఒక్క బిల్లు కూడా పాస్ కాకపోవడం విశేషం.
మరోవైపు 18 ఏప్రిల్ 2017న అధ్యక్షుడు ట్రంప్ బై అమెరికన్, హైర్ అమెరికన్ పేరుతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను తీసుకొచ్చారు. అంతేకాదు అమెరికా పరిపాలన విభాగంలోని పలు శాఖలను హెచ్ 1-బీ వీసాలపై సంస్కరణలు తీసుకొచ్చేలా సలహాలు సూచనలు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ఈ శాఖలు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం హెచ్ 1-బీ, ఎల్ -1 వీసాలపై తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా ప్రజాప్రతినిధులను భారత ప్రభుత్వం కోరింది.