పేలిన హైడ్రోజన్ బాంబు: ఆందోళనలో చైనా, జపాన్
న్యూఢిల్లీ: అణుబాంబు కంటే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ హైడ్రోజన్ ప్రయోగంతో కొరియా సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఈశాన్య ఉత్తర కొరియాలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.
అంతకముందు ఉత్తరకొరియాలో సంభవించింది భూకంపమా లేదా అణ్వస్త్ర పరీక్షా అని చైనా అధికారులను సందేహంలో పడేసింది. అందుకు కారణం లేకపోలేదు. ఉత్తర కొరియా ఉన్న ప్రాంతాన్ని బట్టి భూకంపాలు సంభవించే అవకాశం తక్కువ. ఇదే విషయాన్ని యూరోపియన్ భూకంప కేంద్రం తేల్చిచెప్పింది.
అంతర్జాతీయంగా దీనిపై పెద్ద స్థాయిలో చర్చ మొదలవ్వడంతో చివరకు ఉత్తరకొరియానే హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ప్రకటించింది. ఇటీవలి కాలంలో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం చైనా, జపాన్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
2013లో భూగర్భంలో అణు పరీక్షలు విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే తొలిసారి. ఈ హైడ్రోజన్ బాంబును పరీక్షించడం వల్ల 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ బుధవారం ఉదయం వెల్లడించింది.
సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించిన హైడ్రోజన్ బాంబుతో పొరుగుదేశమైన దక్షిణ కొరియా ఉన్నతాధికారులతో అత్యవసర భేటీని నిర్వహించింది. హైడ్రోజన్ బాంబు పరీక్షను చైనా, జపాన్లు సైతం ఖండిస్తున్నాయి.
కాగా, జనవరి 8వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు కావడంతో తమ సత్తాను ప్రపంచ దేశాలకు తెలియజేయడం, తమవద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నారు.
హైడ్రోజన్ బాంబు పరీక్షను ఖండించిన అమెరికా
ఉత్తర కొరియా చేపట్టిన హైడ్రోజన్ బాంబు పరీక్షపై అమెరికా స్పందించింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని వైట్హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు దృవీకరించలేకపోతున్నామని అగ్రరాజ్యం అభిప్రాయపడింది.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఉత్తర కొరియా ఎటువంటి అణు పరీక్షలు లేదా క్షిపణి పరీక్షలు కానీ చేయరాదు. మరోవైపు ఉత్తర కొరియా మాత్రం అమెరికాను టార్గెట్ చేసేందుకు హైడ్రోజన్ బాంబు పరీక్షించినట్లు చెప్పడం విశేషం.