డొక్లామ్పై మోడీ ఆదేశాలు: భారత్ నిలదీత, ఆ ప్రశ్నతో తగ్గిన చైనా!
డోక్లామ్ ప్రతిష్టంభన సమసిపోయిన నేపథ్యంలో ఆ విజయం గురించి అందరికీ తెలిపే బాధ్యతను విదేశాంగ వ్యవహారాల శాఖకే వదిలేయం ఉత్తమమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ/బీజింగ్: డోక్లామ్ ప్రతిష్టంభన సమసిపోయిన నేపథ్యంలో ఆ విజయం గురించి అందరికీ తెలిపే బాధ్యతను విదేశాంగ వ్యవహారాల శాఖకే వదిలేయం ఉత్తమమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.
చైనా పరువు కాపాడుకుందా అంటే..: డొక్లామ్పై చైనా మంత్రి ఇలా
అదే విషయాన్ని ఆయన తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన డోక్లామ్ అంశానికి సంబంధించి ఏం మాట్లాడాల్సి వచ్చినా, ప్రకటన చేయాల్సి వచ్చినా, కేవలం విదేశాంగ శాఖనే ఆ పనిని నిర్వర్తిస్తుందని, ఇతర మంత్రివర్గ సహచరులు పెదవి విప్పకూడదని మోడీ చెప్పారని తెలుస్తోంది.
అప్పుడే బీజం
డొక్లామ్ సెగ చల్లారే దిశగా జరిగిన ఒప్పందానికి ముందు చాలా కసరత్తు జరిగింది. ప్రధాని మోడీ జీ 20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో జూలై 7న జర్మనీలో సమావేశమైనప్పుడే ఈ కసరత్తుకు బీజం పడింది.
మోడీ - జీ జిన్పింగ్ ఇలా
ఈ వివాదం మరింత ముదురొద్దని, ఇప్పుడు నెలకొన్న ఉద్రిక్తత ఘర్షణగా మారొద్దని, పరస్పర సహకారంతో మనమిద్దరం చాలా లబ్ధి పొందాల్సి ఉందని, ఈ వివాదాన్ని జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో పరిష్కరించుకుందామని జీ జిన్పింగ్కు స్పష్టం చేశారని తెలుస్తోంది. అందుకు జిన్పింగ్ కూడా అంగీకరించారు.
మోడీ సూచన
జీ 20 సదస్సు నుంచి తిరిగి వచ్చిన వెంటనే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర బృందంతో మోడీ భేటీ అయ్యారు. డోక్లాం వివాదానికి పరిష్కార మార్గాలు చూడాలని, ఇది ఘర్షణ దశకు చేరవద్దని, అదే సమయంలో డోక్లాంలో యథాతథ స్థితిపై వెనక్కి తగ్గొద్దని, భయపెట్టో, బలవంతంగానో అక్కడ పరిస్థితి మార్చాలనుకుంటే కుదరదని స్పష్టమైన సూచనలు చేశారు.
చైనాకు తేల్చి చెప్పిన భారత్
ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్, చైనాలో భారత రాయబారి విజయ్ గోఖలే ఆ దేశ ప్రతినిధులతో పలు దఫాలు చర్చలు జరిపారు. చివరికి జూలై 27న అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచితో బీజింగ్లో సమావేశమయ్యారు. డోక్లాంతో మీకేం సంబంధం అన్నట్లుగా జీచి మాట్లాడారు. అది మీ భూభాగమా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. దీంతో వివాదాస్పద భూభాగాలన్నీ మీవైపోతాయా? అని దోవల్ అడిగారని తెలుస్తోంది. భూటాన్ రక్షణ బాధ్యత తమదేనని, డోక్లామ్ భూటాన్లో అంతర్భాగమని తేల్చి చెప్పారు.
తగ్గిన చైనా
గతంలో డోక్లాంను తమకు ఇచ్చేస్తే అందుకు బదులుగా ఉత్తరం వైపున 500 చదరపు కి.మీ. భూభాగాన్ని ఇస్తామని చైనా స్వయంగా భూటాన్కు ఆఫర్ ఇచ్చిందని గుర్తు చేశారు. డోక్లామ్ను భూటాన్ మీకు అప్పగించలేదని, ఆ వివాదం అలాగే ఉందని, అక్కడ యథాతథ స్థితి కొనసాగాలని, అందుకే డోక్లామ్ నుంచి ఇద్దరం ఒకేసారి వైదొలగాల్సిందేనని, సమస్యకు ఇదే పరిష్కారమని యాంగ్ జీచితో అజిత్ దోవల్ చెప్పారు. భారత్ వైఖరి స్పష్టంగా తేలిపోవడంతో, డ్రాగన్ కంట్రీ బెదిరింపులకు లొంగకపోవడంతో.. డొక్లామ్ నుంచి చైనా తగ్గింది.