పాక్కు మరో పరాభవం: భారత దాడి ఆరోపణపై తేల్చేసిన ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితిలోనూ పాకిస్థాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలోనూ పాకిస్థాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) మీదుగా ప్రయాణిస్తున్న ఐక్యరాజ్యసమితి వాహనంపై భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ పాకిస్థాన్ ఆర్మీ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
ఖంజర్ సెక్టార్ లో బుధవారం భారత్-పాకిస్థాన్ వాహనంలో వెళుతున్న ఐరాస సైనిక పరిశీలక బృందాన్ని లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ పాక్ సైనిక మీడియా విభాగాన్ని ఊటంకిస్తూ ఆ దేశ మీడియా కథనాలు ప్రచురితం చేసింది.
భారత సైన్యం చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, భారత్ కాల్పులను ధీటుగా ఎదుర్కొంటామని పాక్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అయితే, పాక్ ఆర్మీ ప్రకటనలో ఎంతమాత్రం నిజం లేదని ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి బుధవారం మీడియాకు వివరణ ఇచ్చారు.
భీంబర్ జిల్లాలో ఐరాస సైనిక పరిశీలక బృందం వాహనంపై పాక్ సైన్యం ఎస్కార్టుతో వెళుతుండగా, దూరంగా కాల్పుల శబ్ధం వినిపించిందని.. ఇది ఐరాస బృందం లక్ష్యంగా జరిగిన కాల్పులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఐరాస బందంలోని వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.