అర్ధరాత్రి 12.30 గంటలకు.. రైతు నేతలు, కాంగ్రెస్ నేతల అరెస్ట్, ఎందుకంటే..?
రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఫైర్ అవుతుండగా.. హస్తం నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఇవాళ పెద్దపల్లితోపాటు జగిత్యాల జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సతీ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉత్సాహం చూపించారు. ముందస్తుగా కాంగ్రెస్, బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
మంత్రి హరీష్ రావు కొండగట్టు పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రైతు నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారు. అయితే వారిని అర్ధరాత్రి 12.30 కి అరెస్ట్ చేయడం వివాదాస్పదం అవుతుంది. ఆ సమయంలో మెట్.పల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. దీనిపై నేతలు మండిపడుతున్నారు.
చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ పునరోద్దరణ కమీటీ అధ్యక్షుడు గురిజెల రాజరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి షేర్ నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, బీజేవైఎం తెలంగాణ కో ఆర్డినెఆటర్ పల్లికొండ ప్రవీణ్ను అర్ధరాత్రి అరెస్టు చేసి.. ఇవాళ సాయంత్రం విడిచిపెట్టారు.
మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇంత భయమా అని నేతలు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా అరెస్ట్ చేయడం భావ్యం కాదని తెలిపారు. మెట్ పల్లిలో జరిగితే ఓకే కానీ.. జగిత్యాల జిల్లా కేంద్రానికి మంత్రి వస్తే తమను నిర్బందించడం సరికాదని వారు అన్నారు. వరి ధ్యానం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు చేసిన సమయంలో ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తారు. అప్పుడు మీకో న్యాయం.. ఇప్పుడు మాకో న్యాయమా..? అని అడిగారు.