పుట్ట లింగమ్మ ట్రస్ట్పై ఆరోపణలు, మంథనిలో ట్రాక్టర్ సీజ్.. ఇందుకే వామనరావు దంపతుల మర్డర్?..
వామనరావు దంపతుల హత్యకేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. మంథని జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును అరెస్ట్ చేయడంతో కుట్రకోణం బయటకొచ్చింది. ఇప్పుడే కాదు గత 4 నెలల నుంచి వామనరావు దంపతులను మట్టుబెట్టాలని బిట్టు శ్రీను, కుంట శ్రీను అనుకుంటున్నారు. కానీ చివరికీ ఈ నెల 17వ తేదీన ఒంటరిగా దొరకడంతో పని సులువు అయిపోయింది. వామనరావు ఒక్క కుంట శ్రీనుకే కాదు.. బిట్టు శ్రీనుకు కూడా శత్రువేనని తెలిసింది. అతని పొట్ట కొట్టాడని ఇద్దరూ కలిసి ప్రతీకారం తీర్చుకున్నారు.
చారిటబుల్ ట్రస్ట్పై ఆరోపణలు.. రగిలిన
బిట్టు శ్రీను పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్నారు. ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రస్ట్కు చైర్మన్గా బిట్టు శ్రీనే.. ఆ ట్రస్టు సేవా కార్యక్రమాలపై వామన్రావు పలు ఆరోపణలు చేశారు. దీంతో వామనరావు అంటే బిట్టు శ్రీనుకు పగ, ప్రతీకారం ఏర్పడింది. ఆ తర్వాత మంథని గ్రామ పంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కోసం ఒక ట్రాక్టర్ ఉంది. 2015 నుంచి 2019 ఏప్రిల్ వరకు దాని ద్వారా నెలకు రూ.30 వేల ఆదాయం వచ్చేది. అయితే ఆ ట్రాక్టర్ను పంచాయతీ నుంచి తీసి వేయాలని 2019 మార్చిలో పంచాయతీ అధికారిపై వామన్రావు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ట్రాక్టర్ను తొలగించాల్సి వచ్చింది. దీంతో వామనరావు అంటే బిట్టు శ్రీనుకు ప్రతీకారం తీవ్రరూపం దాల్చింది.
రూ.30 వేల ఆదాయం కోల్పోయిన బిట్టు శ్రీను
తనకు వచ్చే రూ.30 వేల ఆదాయాన్ని కోల్పోయేందుకు కారణం వామనరావు అని రగిలిపోయారు. అలా కాకుండా దానిని వామనరావు విజయంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీంతో బిట్టు శ్రీను మరింత కుంగిపోయాడు. ఈ క్రమంలో గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మంచి ప్రెండ్ షిప్ ఏర్పడింది. మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే సమయంలో వామన్రావు దంపతుల గురించి చర్చ వచ్చింది. గుంజపడుగుకు చెందిన వామన్రావు దంపతులతో కుంట శ్రీనుకు కూడా శత్రుత్వం ఉంది. గ్రామంలో తన ఆధిపత్యానికి వామన్రావు అడ్డు వస్తున్నట్టు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు.
4 నెలల క్రితం.. 3 వాహనాల్లో రావడంతో విరమణ
4 నెలల క్రితం వామనరావు గుంజపడుగుకు వచ్చారు. ఆ సమయంలో హత్య చేసేందుకు కుంట శ్రీనివాస్ యత్నించాడు. బిట్టు శ్రీనివాస్ ట్రాక్టర్ పట్టీలతో రెండు కత్తులు తయారు చేయించి.. చిరంజీవి ఇంట్లో పెట్టాడు. అయితే వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు వచ్చారు. వారిని చూసిన చిరంజీవి.. బిట్టు శ్రీనుకు సమాచారం ఇవ్వగా, అతడు ఆ విషయాన్నికుంట శ్రీనుకు చెప్పాడు. దీంతో వామన్రావును హత్య చేసేందుకు కుంట శ్రీను గుంజపడుగు బస్టాప్లో ఎదురు చూశాడు. వామన్రావు ఎక్కువ మందితో రావడంతో హత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. వామన్రావు ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం.. వామన్రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చినట్టు తెలిసింది. ఒంటరిగా వచ్చారని తెలిసి.. మర్డర్ చేశారు.