డప్పు కొట్టింది ఎవరు.. కాలికి గజ కట్టింది ఎవరు, వారు ఎక్కడ, కేసీఆర్పై షర్మిల పైర్
కడుపులో పడకముందే.. పుట్టకముందే.. అంటరానితనానికి, అసమానతకు గురైన జాతి.. దళిత జాతి. ఊరిలోకి రావొద్దని, ఊరి బయట దళిత వాడలో ఉండాలని, గుడిలోకి ప్రవేశం లేదని, బావిలోని నీరు తాగొద్దని, డప్పే కొట్టాలని, చెప్పులే కుట్టాలని, సఫాయి పనే చేయాలని అన్యాయంగా దళితులను చిన్న చూపు చూసింది సమాజం అని వైఎస్ షర్మిల అన్నారు. నల్లగొండ జిల్లా, తుంగతురి నియోజకవర్గం, తిరుమలగిరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత భేరి సభకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. అంటరానితనంపై పోరాటం చేసి.. సమానత్వం కోసం తన జీవితాన్నే దారపోసిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ అని చెప్పారు. సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటం చేసి.. భవిష్యత్తు తరానికి ఒక దారి, దిశ చూపించిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ అని చెప్పారు. ఒక మెజార్టీ వర్గం అభిప్రాయమే కాదు.. మెజార్టీ లేని వర్గాల అభిప్రాయం కూడా కొన్ని సందర్భాల్లో తీసుకోవాలి.. వాటికి విలువనివ్వాలని, రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచారు కాబట్టే.. ఈ రోజు తెలంగాణ సాధ్యమైందని గుర్తుచేశారు.
పోరాడింది ఎవరు..?
ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎవరు.. ఉద్యమాన్ని భుజాన వేసుకుంది ఎవరు.. ఉద్యమంలో డప్పు కట్టింది ఎవరు.. కాలుకు గజ్జకట్టింది ఎవరు.. గొంతెత్తి పాడింది ఎవరు.. నా దళిత జాతి బిడ్డలు కాదా..? ఆటే ఆయుధంగా.. పాటే తూటాగా.. పోరాటమే శ్వాసగా ఉద్యమంలో ఉద్యమకారులు, కళాకారులు, దళిత బిడ్డలు పోరాడితే సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఆత్మబలిదానాలు చేసుకున్నవారిలో 400 మంది దళిత బిడ్డలే కదా.. అలాంటి దళిత బిడ్డలను నెత్తిన పెట్టుకోవాలని సూచించారు. ఇవాళ దళిత బిడ్డలు ఎక్కడున్నారు..? సాధించిన తెలంగాణలో దళితులది ఏంటీ పరిస్థితి.. సగానికి సగం మందికి చదువు లేదు. వందలో 90 మందికి పక్కా ఇల్లు లేదు. 100లో 80 మందికి ఒక్క సెంట్ భూమి కూడా లేదు. 100లో 60 మంది వ్యవసాయ కూలీలుగానే బతుకుతున్నారు. ఆత్మాభిమానం లేదు.. ఆత్మగౌరవం దొరకదు. దొరికిందల్లా అవమానాలు, మోసాలు, అణచివేతలు. అది ఈ రోజు తెలంగాణలోని దళితుల పరిస్థితి అని చెప్పారు.
దొంగ ప్రేమ
ఎన్నికలు వస్తే దొంగ ప్రేమ కురిపించడం. ఎన్నికలు అయిపోయిన తరువాత విషం చిమ్మడం కేసీఆర్కు అలవాటైపోయిందన్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడం కేసీఆర్ నైజం అన్నారు. ఎన్నికలు వస్తే దళిత కాళ్ల బేరానికి వస్తాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత వాళ్ల జుట్టు పట్టుకొని ఆడిస్తాడు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో దళితులకు చేయని మోసం లేదు.. చేయని అవమానం లేదు. అన్ని రకాలుగా అవమానం, మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు ప్రతి రోజు దళితులను మోసం చేస్తూనే ఉన్నాడు. ఒకటా.. రెండా.. కేసీఆర్ మోసాలు చెప్పుకుంటూ పోతే రామాయణం వింటూ పోతే మహాభారతం. మూడెకరాల భూమి ఇచ్చాడా..? డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చాడా..? లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి కోసమే ఖర్చు చేస్తున్నాడా..? ఎస్సీ, ఎస్టీలకు ప్రతి విషయంలో అండగా ఉన్నది వైఎస్ఆర్ గారు. కేసీఆర్.. అన్ని విధాలుగా ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తున్నాడు. దళితులను కనీసం మనుషులుగా చూడడం లేదు. దళితులంటే విలువ లేదు. కనీసం రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్ అంటే కూడా కేసీఆర్కు లెక్కలేదు.
పేరు మార్చి
డాక్టర్ వైఎస్ఆర్ కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని తపించి ప్రాణహిత చేవెళ్లకు రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టుకు నామకరణం చేసింది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు. కానీ, కమీషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ ఆ ప్రాజెక్టును కాళేశ్వరంగా రీడిజైన్ చేసి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్గా చెప్పాడు కానీ, తెలివిగా అంబేడ్కర్ పేరును తొలగించాడు. హైదరాబాద్ హుస్సేన్సాగర్లో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. కట్టాడా..? విగ్రహం పెడతానని ఐదేళ్ల పైనే అయిపోయింది. విగ్రహం ఎవరికైనా కనిపిస్తుందా..? ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, మొదటి సంవత్సరం పెట్టుబడి సాయం, నీళ్ల సదుపాయం కల్పిస్తానన్నాడు. మూడు లక్షల మంది దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మాటిచ్చాడు. మూడు లక్షలు కాదు కదా.. 300 మందికైనా ఇచ్చారా..? లేదా 30 మందికైనా ఇచ్చారా..? దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి.
ఏవీ ఇళ్లు
డబుల్ బెడ్రూం ఇళ్లు అన్నాడు.. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు.. 4 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానన్నాడు.. 4 లక్షలు కాదు కదా.. 400 కట్టాడా..? లేదా 40 కట్టాడా.. దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి. దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే గౌరవం లేదు. కేసీఆర్ చూపే వివక్ష, అవమానాలకు సర్వీస్ ఉండగానే రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. దళిత ఆఫీసర్లను పనిచేయించుకోవడం కాదు కదా.. కనీసం దళితులుపక్కనుంటే ఆ వాసన కూడా పడదన్నారు. కేసీఆర్ చుట్టుపక్కల దళితులు ఉండరు. కేసీఆర్ గారికి పది మంది సలహాదారులు ఉంటే వారిలో ఒక్కరు కూడా దళితులు లేరు. దళిత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అంటే విలువ లేదు.. దళిత నాయకులు, ఎమ్మెల్యేలు అంటే లెక్క, గౌరవం లేదు. ఒక దళిత సర్పంచ్కు అసలు దిక్కే లేదు. ఏదైనా కార్యక్రమంలో దళిత సర్పంచ్ ఉంటే కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక ఆ సర్పంచ్ మహిళ అయితే.. దళితురాలు అని గౌరవించకపోయినా.. కనీసం మహిళా అనే గౌరవం కూడా ఇవ్వరని ఆరోపించారు.
శూన్యమే
రాజకీయంగా ఏమైనా చేశారా అంటే.. కేసీఆర్ కేబినెట్లో ఎంత మంది మహిళలు ఉన్నారు. మాల మంత్రి ఉంటే మాదిగ మంత్రి ఉండరు. మాదిగ మంత్రి ఉంటే మాల మంత్రి ఉండరు. జనాభా ప్రాతిపదిక ప్రకారం మంత్రులుగా దళితులు ముగ్గురు ఉండాలి. కానీ కేసీఆర్ కేబినెట్లో ఒక్క దళిత మంత్రి మాత్రమే. కేబినెట్ ర్యాంకు ఉన్న మంత్రి అయితే ఒక్కరు కూడా లేరు. కేవలం తెలంగాణ నుంచే ముగ్గురు దళితులకు మంత్రులుగా అవకాశం ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్. సిద్దిపేటలో వైఎస్ఆర్ ఉండగా దళితులకు భూపంపిణీ చేశారు. ఇప్పుడు అదే సిద్దిపేటలో వైఎస్ఆర్ పంపిణీ చేసిన భూముల్లో కలెక్టరేట్ కట్టాలని ఆ భూములను గుంజుకుంటున్నారు. దళితుల భూములే కావాల్సి వచ్చాయా..? గజ్వేల్ సీఎం నియోజకవర్గం.. రైతు వేదిక కట్టడానికి దళితుడి భూమి గుంజుకున్నారు. దళితుడి భూమి కావాల్సి వచ్చిందా..? కలెక్టరేట్కు, రైతు వేదికకు, పబ్లిక్ పార్కులకు భూములు ఇవ్వలేడా..? దళితుల భూములే కావాల్సి వచ్చిందా..? అని నిలదీశారు.
భూములు
ఇప్పుడు పేదల భూములు లాక్కుంటున్నారు.. దళితుల భూములు, ఎస్టీల భూములు లాక్కుంటున్నారు. ఎందుకు..? బ్లడ్, ఐ బ్యాంకుల గురించి విన్నాం.. ఇప్పుడు ల్యాండ్ బ్యాంకులు అంట. ఎకరా ఎకరా కూడబెట్టి వేల ఎకరాలను జమ చేయడమే ఈ భూమి బ్యాంకు. అలా వేల కోట్లు విలువ చేసి భూమిని పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్ వాళ్ల బినామీలకు, కమీషన్లు ఇచ్చేవారికి అప్పనంగా ఇచ్చేస్తున్నారు. అయ్యా కేసీఆర్.. ఎంత భూమి స్వాహా చేస్తే మీ కడుపు నిండుతుంది. ఎంత అవినీతి చేస్తే మీ కడుపు నిండుతుంది. మీ దురాశకు హద్దులు లేవా.. మీ అత్యాశ అంతం కాదా..? ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను. మీరేమో వేల ఎకరాలు, లక్షల కోట్లు అవినీతి చేయొచ్చు. పాపం దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నారు. దళితుల కోసం ల్యాండ్ బ్యాంక్ అవసరం లేదా..? మీకు నిజంగానే దళితులకు భూమి ఇవ్వాలనే బుద్ధి ఉంటే భూ సేకరణ చేయాలి కదా..? భూమి ఇచ్చే ఉద్దేశం ఉందని ఎలా నమ్మాలని అడిగారు.
లెక్కేలేదు
దళితుల మీద జరిగే అత్యాచారాల గురించి అయితే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు దళిత మీద సంవత్సరానికి 270 దాడులు జరిగితే.. కేసీఆర్ హయాంలో దాడులు 800 శాతం పెరిగాయి. సగటున దళితుల మీద రాష్ట్రంలో ప్రతి రోజు 5, 6 మంది మీద జరుగుతున్నాయి. నేరెళ్ల ఘటనలో చూశాం. ఎందుకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నించలేదు. అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే.. ఆ లారీల కింద పడి మా బిడ్డలు చనిపోతున్నారని అడిగారు. దానికి వారిని జైల్లో పెట్టి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇష్టం వచ్చినట్టు కొట్టించారు కేసీఆర్ గారు. భువనగిరిలో మరియమ్మ అనే దళిత మహిళను పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపేశారు. అంటే ఆమె ప్రాణానికి విలువ లేదా..? ఆసిఫాబాద్లో ఇంకో దళిత మహిళలను అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమె చేతి వేళ్లను నరికేసి.. చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఈ ఘటనపై కేసీఆర్ ఏం చర్యలు తీసుకున్నారు. దళిత యువకులను టీఆర్ఎస్ పార్టీ నాయకులే చంపేస్తుంటే.. కేసీఆర్ నోరు మెదపడం లేదని అడిగారు.
స్ఫూర్తి
అంబేడ్కర్ ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలే వైఎస్ఆర్ గారికి స్ఫూర్తి. అంబేడ్కర్ అసమానత్వంపై పోరాటం చేస్తే.. వైయస్ఆర్ గారు సమాన అభివృద్ధి కోసం బహుజన సంక్షేమం కోసం పనిచేశారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా వైయస్ఆర్ గారు ఆలోచించారు. అందుకే వైయస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించారు. ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు. 46లక్షల పక్కా ఇండ్లు పేదల కోసం కట్టించించారు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రుణాలు అందించి, స్వయం ఉపాధి కల్పించారు. వైయస్ఆర్ గారు ఎస్సీ కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి వందల కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ఆర్ పనితీరును ఎస్సీ, ఎస్టీ అధికార ఫోరం అభినందించింది. దళితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాకుండా వారికి ప్రత్యేకంగా రూ.25వేల ఆర్థిక సాయం చేశారు.
అవమానాలే
కేసీఆర్కు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదు. దళిత ఆఫీసర్లను అవమానించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బంద్ చేశారు. దళితులపై దాడులు జరుగుతున్నా నోరు మెదపలేదు. కేసీఆర్ గారికి దళితులపై ఉన్నది దొంగ ప్రేమే. హుజురాబాద్లో ఎన్నికలు వచ్చాయి కాబట్టే దళితులకు రూ. 10లక్షలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.. ఎన్నికలు ఉన్నాయి కనుకనే హుజూరాబాద్ లో దళిత బంధు పెట్టామని చెప్పడం సిగ్గుచేటు. దీనితోనే కేసీఆర్ కు దళితులపై ప్రేమలేదనేది తెలిసిపోతుంది. రాష్ట్రంలో దళిత కుటుంబాలకు రావాల్సింది రూ.10లక్షలు కాదు. మొత్తం రూ.61లక్షలు. మూడెకరాల భూమి, ఏడేండ్ల రాబడి, దళితుల కోసం కేటాయించిన నిధులు ఇలా ఇవన్నీ కలుపుకుంటే ప్రతి దళిత కుటుంబానికి రూ.61లక్షలు ఇవ్వాలి. కేసీఆర్ ఇచ్చే రూ.10లక్షలు తీసుకుని, మిగతా రూ.51లక్షలు ముక్కుపిండి వసూలు చేయండి.
Recommended Video
10 లక్షలు చాలా..
కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తే జీవితం స్థిరపడుతుందా? దీనికి బదులు ప్రతి దళిత కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. ఇందులో 35వేల మంది దళిత బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. 2018లో కేసీఆర్ దళితులను వ్యాపారవేత్తలు చేస్తానని చెప్పి, ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. డప్పు కొట్టే, చెప్పు కుట్టే వారికి పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. దళితుల రావాల్సిన నిధులన్నీ స్వాహా చేశారు. ఈ పాలకులకు దళితులంటే ప్రేమ లేదు. ప్రతిపక్షాలకు సైతం దళితులంటే చిన్నచూపు ఉంది. ఓ బీజేపీ నాయకుడు దళిత వాడకు వస్తున్నాడు అంటే, దళితుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు అంటే అది ముమ్మాటికీ ఓట్ల కోసమే. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలు దళితులను మోసం చేస్తున్నాయి. వీరి హయాంలో దళిలకు రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ సైతం దళితులకు అన్యాయం చేసింది. దళితుల పక్షాన పోరాటం చేయడం లేదని షర్మిల చెప్పారు.