మంత్రి కెటిఆర్ను చూడాలని...: 14 ఏళ్ల విద్యార్థి కోరిక
ఖమ్మం: చిన్న వయస్సులోనే ప్రాణాంతక వ్యాధి బారినపడి మృత్యువుతో పోరాడుతున్న 14 ఏళ్ల పదో తరగతి విద్యార్థి నల్లంటి సంతోష్ ఐటీశాఖ మంత్రి కెటి రామారావును చూడాలని కోరుకుంటున్నాడు. తన స్వప్నమైన ట్రిపుల్ ఐటీ విద్యను చదువుతానా, లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతన్నాడు.
డాక్టర్లు, బంధువులు మాట్లాడుకునే మాటలు విని ఐటీశాఖ మంత్రి చేపడుతున్న సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిని విని కెటిఆర్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఇంటికి ఆదరవు అవుతాడనే సమయంలో కొడుకు బతుకడని తెలిసిన తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన జ్యోతి, కృష్ణార్జునరావులకు ముగ్గురు సంతానం.
మొదటి కొడుకు సంకీర్త్ పాలిటెక్నిక్, రెండో కొడుకు సంతోష్ పదో తరగతి, కూతురు సాత్విక ఏడో తరగతి చదువుతున్నారు. తల్లి ఈజీఎస్లో రోజువారీ వేతనంపై ఎంపీపీ కార్యాలయంలో పనిచేస్తుండగా, తండ్రి ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్లుగా సంతోష్కు ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో నొప్పి, మంట వంటి సమస్యలు మొదలయ్యాయి.
గ్యాస్ట్రిక్కు సంబంధించిన మందులు వాడుతుండగా తగ్గుతుండటంతో తరుచూ వాటిపైనే ఆధారపడ్డారు. పదిరోజుల క్రితం ఈ సమస్య తీవ్రం కావడంతో సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాదులో మూడు కార్పొరేట్ వైద్యశాల ల్లో చూపించి, సుమారు రూ. 2లక్షల పై చిలుకు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించడంతో చేసేది లేక వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆదివారం సం తోష్ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ను కలిసే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంతోష్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.