పాపం పసివాడు: విమానంలో ఊపిరాడక మృతిచెందిన నాలుగు నెలల చిన్నారి
హైదరాబాద్: విమానం ఆకాశంలో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ నాలుగు నెలల చంటి పిల్లాడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడి మృతిచెందాడు. బెంగళూరు నుంచి పాట్నా వెళ్లే ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో వెళుతున్న ఈ చంటి పిల్లాడు...ఒక్క సారిగా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు విమాన సిబ్బందికి తెలియజేశారు.
ఇక హైదరాబాద్ దగ్గరగా ఉండటంతో ఇండిగో విమానంలోని సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం తెలిపారు. వెంటనే డాక్టర్ను అంబులెన్స్ను సిద్ధం చేయాల్సిందిగా వారు కోరారు. విమానం ల్యాండ్ కాగానే చిన్నారిని అంబులెన్స్లో దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆ బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బిడ్డ మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్లముందే బిడ్డను పోగొట్టుకున్నామని ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది.
ఉదయం 7 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిన వెంటనే విమానాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన కూడా అధికారులు విడుదల చేశారు. చిన్నారితో పాటు విమాన సిబ్బంది, ఒక డాక్టరు కూడా ఉన్నారని వారు తెలిపారు. హాస్పిటల్కు తరలించేలోపే పసివాడు మృతి చెందడం దురదృష్టమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.