ఓటుకు నోటు: స్టీఫెన్ కూతురు జెస్సికా, టేలర్ వాంగ్మూలం ఇదీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సాక్ష్యుల్లో ఒకరైన ఇంటి యజమాని మాల్కం టేలర్ జడ్జి ముందు శుక్రవారం నాడు వాంగ్మూలం ఇచ్చారు. 25 ఏళ్లుగా తనకు స్టీఫెన్ సన్ స్నేహితుడని, గత నెల 31న అతను తనకు ఫోన్ చేశాడని, తన ఇంటికి ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నారని చెప్పాడని వాంగ్మూలంలో చెప్పాడు.
వాళ్లకు తన ఇంట్లో కలవడం ఇష్టం లేదని చెప్పాడని, దీంతో పుష్పనిలయంలోని తన నివాసానికి రమ్మని చెప్పానని పేర్కొన్నాడు.
టీడీపీకి చెందిన వ్యక్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి ముడుపులు ఇవ్వాలనుకుంటున్నారని తనతో చెప్పాడని, ఏసీబీకి సమాచారం ఇచ్చానని, అందులో తన సహకారం కావాలని కోరాడని చెప్పాడు.
ఆ తర్వాత కాసేపటికి ఏసీబీ అధికారులు వచ్చి ఆడియో, వీడియో పరికరాలు అమర్చారని, అప్పుడు స్టీఫెన్కు ఫోన్ వచ్చిందని, ఆ ఫోన్లో తమ అడ్రస్ చెప్పారని తెలిపాడు. రేవంత్, సెబాస్టియన్ వస్తున్నట్లు చెప్పారని, వారు సాయంత్రం 4.20 గంటలకు వచ్చారన్నాడు.
డబ్బులు ఇచ్చి, రేంత్, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు వెళ్లిపోతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. అనంతరం ఏసీబీ నగదును తీసుకు వెళ్లిందని, అధికారులు తనను అక్కడే విచారించి వాంగ్మూలం నమోదు చేశారని చెప్పాడు.
స్టీఫెన్ కూతురు జెస్సీకా వాంగ్మూలం
తాను బోయిగూడలోని తన ఇంట్లో తండ్రితో పాటు ఉంటున్నానని, మే 30న మధ్యాహ్నం 12 గంటలకు పొడుగ్గా బలంగా ఉన్న వ్యక్తి, పొట్టిగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తన తండ్రి తనను పిలిచి వాళ్లిద్దరికీ మంచినీళ్లివ్వమంటే ఇచ్చానని, కొంతసేపటికి వాళ్లు వెళ్లిపోయారని చెప్పింది.
పొట్టిగా ఉన్న వ్యక్తి రేవంత్ అని, పొడుగ్గా బలంగా ఉన్న వ్యక్తి సెబాస్టియన్ అని తన తండ్రి తనతో చెప్పాడని, మే 28న మధ్యాహ్నం 12 గంటలకు సెబాస్టియన్ తన ఇంటికి వచ్చాడని, అతనికి నీళ్లు ఇచ్చానని, అతనితో పాటు ఆంటోనీ అనే వ్యక్తి వచ్చాడని తెలిపింది.