చంద్రబాబుకు మరో షాక్: గులాబీ గూటికి మరో ఇద్దరు?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా? తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్లు గులాబీ కండువా కప్పుకోనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి మరింతగా బలం చేకూర్చే విధంగా సోమవారం జరిగిన పరిమాణాలు తెలియజేస్తున్నాయి. దివంగత నేత, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్టీఆర్ భవన్కు వచ్చారు.
ఎలిమినేటి మాధవరెడ్డి నివాళులర్పించిన అనంతరం తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతో ఆయన కాసేపు భేటీ అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీకి చెందిన గాంధీ, గోపీనాథ్లు హాజరు కాలేదు.
పార్టీ అధినేత వస్తున్నారని ముందస్తుగా సమచారం పంపినా వారు హాజరు కాలేదు. ఈ తాజా పరిణామాలు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఈ కార్యక్రమానికే హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే 'టీఆర్ఎస్ ఆపరేషన్' లో భాగంగా ఆ పార్టీలో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు చేరారు. వివేక్, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు.
కాగా ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశంలో పార్టీ తరుపున సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలు మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురిలో ఆర్ కృష్ణయ్య ఉన్నా లేనట్లే. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య టీడీపీ ఎమ్మెల్యేగా కంటే కూడా బీసీ సంఘం అధ్యక్షుడిగా ప్రజలకు బాగా సుపరిచితం.