అయూబ్ ఖాన్ జైలు నుంచే పాస్పోర్ట్: బురిడీ కొట్టిస్తూ... చక్కబెట్టుకుంటూ..
దుబాయ్ పారిపోయిన గ్యాంగస్టర్ అయూబ్ ఖాన్ అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘోరీ హత్య కేసులో నిందితులను కూడా బెదిరించినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: గ్యాంగస్టర్ అయూబ్ ఖాన్ విషయంలో కొత్త విషయాలు వెలుగు చూస్తన్నాయి. బెదిరింపులు, హత్యలు, భూకబ్జా కేసుల్లో నిందితుడైన అతను పోలీసుల కళ్లు గప్పి హైదరాబాద్ వచ్చిపోతూ తన పనులు చక్కబెట్టుకుంటూ వచ్చాడని తెలుస్తోంది. అతను జైలు నుంచే పాస్పోర్టు సంపాదించాడు. దాంతో దుబాయ్కి వెళ్లి ఆ తరువాత ఐదుసార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్లాడని హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు గుర్తించారు.
తప్పుడు పాస్పోర్టు పొందిన తర్వాత హైదరాబాద్ వచ్చి తన అనుచరులతో సమావేశాలు నిర్వహించాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. న్యాయవాది మన్నన్ఘోరీ హత్య కేసులో సాక్షులైన అతడి సోదరుడు, బంధువులను రెండు నెలల క్రితం బెదిరించినట్లు కూడా తెలుస్తోంది.
అయూబ్ ఖాన్ మామూలోడు కాడు: 16 ఏళ్లకే హత్య చేశాడు, తండ్రి ఆర్మీలో పనిచేశాడు
రంజాన్ పండుగ సమయంలోనూ అయూబ్ వచ్చాడన్న సమాచారం పోలీసులకు వచ్చినా శంషాబాద్ విమానాశ్రయంలో వివరాలు లేకపోవడంతో పట్టుకోలేక పోయారు. మన్నన్ఘోరీ హత్య కేసులో జైల్లో ఉన్న అయూబ్ఖాన్ నవీద్ఖాన్ పేరుతో 2010వ సంవత్సరం తత్కాల్ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. గోల్కొండలో ఉన్నట్టు ఓటర్, ఆధార్, పాన్కార్డు సృష్టించాడు. పాస్పోర్టు వచ్చిన నాలుగేళ్లకు హైకోర్టులో అతడిపై కేసు కొట్టేయడంతో వెంటనే నవీద్ఖాన్ పేరుతో దుబాయ్కి వెళ్లి పోయాడు.
భార్య పేరు చేర్చాలని అయూబ్ ఖాన్...
తన భార్య హఫీజాబేగం పేరును పాస్పోర్టులో అదనంగా చేర్చాలని దుబాయ్ నుంచే అభ్యర్థించి ఆగస్టు, 2015లో కొత్త పాస్పోర్టు సంపాదించాడు. ఇక తనను పోలీసులు గుర్తించలేరన్న ధైర్యంతో అప్పుడప్పుడూ ముంబైకి వచ్చి అనుచరులతో సమావేశమయ్యేవాడు. మరోవైపు దక్షిణ మండలం పోలీసుల వద్ద అయూబ్ఖాన్ పాత పాస్పోర్టు(2001) ఉండడంతో, దాని ఆధారంగా అతనొస్తే పట్టుకోండంటూ విమానాశ్రయాల్లో సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు.
ధైర్యంగా హైదరాబాద్ పాతబస్తీకి..
ముంబైకి వచ్చినా చిక్కులు ఎదురు కాకపోవడంతో అయూబ్ఖాన్ నిరుడు ఏప్రిల్లో దుబాయ్ నుంచి పాతబస్తీకి వచ్చాడు. పోలీసులకు అనుమానం రాకపోవడంతో ఇక రెండు నెలలకోమారు వచ్చి వెళ్లేవాడు. రంజాన్ పండుగకు వచ్చాడన్న సమాచారంపై పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించారు. అయూబ్ఖాన్, అతడి భార్య పేరుతో వివరాలను పరిశోధించారు. పాస్పోర్టు వివరాలు లభించడంతో నిరుడు నవంబరులో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అప్పటికే అయూబ్ఖాన్ హైదరాబాద్కు వచ్చి వెళ్లిపోయాడు.
మరో ప్రయత్నం చేసి...
డిసెంబరు నెలలో మళ్లీ హైదరాబాద్ రావడానికి ప్రయత్నించాడు. దంతో ముంబైలో విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. అయూబ్ఖాన్ పాత కేసులకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. తత్కాల్ పాస్పోర్టు ఎలా వచ్చిందో పరిశోధన చేస్తున్నామని వివరించారు.
రావద్దు... వెళ్లిపోండి..
అయూబ్ను హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ఠాణాకు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసు స్టేషన్ వద్దకు అయూబ్ఖాన్కు బంధువులైన ఇద్దరు మహిళలు వచ్చారు. అయితే, ఎందుకు వచ్చారని గద్దించి, వెళ్లిపోవాలని వారికి చెప్పాడు.
పోలీసు కస్టడీకి అయూబ్
అయూబ్ ఖాన్ నుంచి బెదిరింపులు ఎదుర్కున్నవారు క్రమంగా బయటకు వస్తున్నారు చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో తనను బెదిరించి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు సయ్యద్హాజి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పాస్పోర్టుపై నగరానికి వచ్చి చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని ఓ హోటల్ వద్ద ఓ భూమి విషయమై బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడని ఆయన చెప్పారు. అయూబ్ అరెస్టు తర్వాత డీసీపీ చేసిన ప్రకటనతో సయ్యద్ హాజి గత డిసెంబరు 26వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయూబ్ఖాన్పై కేసునమోదు చేసి, కస్టడీకి తీసుకుని విచారించామని చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్రెడ్డి తెలిపారు.