తెలంగాణపై బీజేపీ 'ఫుల్ టైమ్' ప్లాన్: వారికి యూపీ బైక్లు
తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం కోసం బీజేపీ బాగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం కోసం బీజేపీ బాగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ చెప్పారు.
ఏపీలోను టిడిపితో వెళ్తే తమకు లాభిస్తుందా, వైసిపితో వెళ్తే లాభిస్తుందా అనే డైలమాలో ఉంది. తెలంగాణలో మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ ఫార్ములాను ఇక్కడ వర్క్వుట్ చేయాలని భావిస్తోంది.
యుపిలో క్షేత్రస్థాయి ప్రచారం కోసం బీజేపీలో పుల్ టైమర్స్ను నియమించింది. వామపక్షాల్లో పార్టీ వ్యవహారాల కోసం పుల్ టైమర్స్ ఉంటారు. కుటుంబ అవసరాల కోసం పార్టీయే వారికి కొంత డబ్బు ఇస్తుంది. ఇప్పుడు ఇదే సంస్కృతిని బీజేపీ మొదలెట్టింది.
తెలంగాణలో మిషన్ 60 కోసం 60 మంది మెరికల్లాంటి పుల్టైమర్స్ను ఎంపిక చేసింది. నియోజకవర్గానికి ఒకరిని పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు పార్టీ ఉపయోగిస్తుంది. వీరు కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వారికి యుపిలో బైకులు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలోను బైకులు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు బైకులు యుపి నుంచి తెలంగాణకు తీసుకొచ్చింది. అమిత్ షా పర్యనటలో వారికి అందజేయనుంది. ఇటు ఏపీ కోసం మరో 60 బీజేపీ బైకులు సిద్దం చేసింది. యూపీ నుంచి తెప్పించిన బైక్లు తెలంగాణలోని బిజెపి పార్టీ కార్యాలయానికి వచ్చాయి.
ఈ బైక్లను తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన కార్యకర్తలకు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బిజెపి పట్ల ఆకర్షితులయ్యేలా ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. ప్రజలను బిజెపి వైపు ఆకర్షించడం వారి పని.