పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య; నారాయణపేట జిల్లాలో విషాద ఘటన
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్ళల్లో విషాద ఘటనలు చోటు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. నేడు పెళ్లి చేసుకోవలసిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు.
నారాయణపేట జిల్లాలోని మక్తల్ పురపాలక పరిధిలో చందాపూర్ కి చెందిన పద్మమ్మ, వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరికి పది రోజుల కిందట ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మంగళవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే సోమవారం నాడు తెల్లవారుజామున కుటుంబసభ్యులు నిద్రలేచేసరికి భీమేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని వెంటిలేటర్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి కావలసిన కూతురు విగతజీవిగా మారడంతో ఒక్కసారిగా షాకైన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని తెలిపిన భీమేశ్వరి తనకు నిశ్చితార్థం అయినా కూడా చందాపూర్ కు చెందిన లిక్కి అలియాస్ నరసింహులు అనే యువకుడు తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని సూసైడ్ నోట్లో రాసింది. అతని వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా భీమేశ్వరి తాను రాసిన సూసైడ్ నోట్లో వెల్లడించింది. ఇక భీమేశ్వరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భీమేశ్వరిని వేధింపులకు గురి చేసిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఇటీవల వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో శంషీర్ గంజ్ లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన హన్మంత్ చారి కుమార్తె సాహితీ వివాహాన్ని ఈసీఐయల్ కు చెందిన యువకుడితో పెళ్లి చెయ్యటానికి నిర్ణయం తీసుకోగా సాహితీ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాహితి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.