వేటు పడింది: ఖైదీల పరారీ, అధికారితోపాటు 7గురి సస్పెన్షన్
కేంద్ర కారాగారం నుంచి కరుడుగట్టిన ఇద్దరు ఖైదీలు రాజేశ్యాదవ్, సైనిక్సింగ్ పారిపోయిన ఘటనకు కారకులైన సిబ్బందిపై వేటు పడింది.
వరంగల్: కేంద్ర కారాగారం నుంచి కరుడుగట్టిన ఇద్దరు ఖైదీలు రాజేశ్యాదవ్, సైనిక్సింగ్ పారిపోయిన ఘటనకు కారకులైన సిబ్బందిపై వేటు పడింది. నవంబర్ 12 అర్ధరాత్రి దాటాక ఖైదీలు జైలు గోడను దూకి పారిపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సైనిక్ సింగ్ విశాఖపట్నం గాజువాకలో పోలీసులకు చిక్కాడు. రాజేశ్యాదవ్ ఇప్పటికీ దొరకలేదు. ఈ సంఘటనపై వరంగల్ జైళ్లశాఖ డీఐజీ కేశవనాయుడు ప్రాథమిక విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తర్వాత జైలు పర్యవేక్షణాధికారి న్యూటన్ను సర్కారు బదిలీ చేసింది.
ఉన్నతాధికారుల విచారణ
హైదరాబాద్ రేంజి డీఐజీ నరసింహా 17న కేంద్ర కారాగారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. వివరాలు సేకరించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ఘటనలతో జైలులో పని చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. జైలు ఉప పర్యవేక్షణాధికారి జి.శ్రీనివాస్, జైలర్ నరసింహస్వామి, డిప్యూటీ జైలర్ సుభాష్, హెడ్వార్డర్లు రాములు, మురళీధర్, వార్డర్లు సంతోష్, శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి జైలు డీజీ వీకే సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూటన్పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
సంచలనం
వరంగల్ కేంద్ర కారాగారం చరిత్రలో ఒకేసారి ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేయడం సంచలనమైన విషయమని జైలు సిబ్బంది అంటున్నారు. సిబ్బంది సస్పెండ్ విషయంపై జైలు ఇంఛార్జి పర్యవేక్షణాధికారిని వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఇతర అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెబుతున్నారు.