రేవంత్ మైండ్ సెట్ మార్చండి,లేదా పీసిసి పదవి నుంచి తప్పించండి.!సోనియాకు జగ్గారెడ్డి లేఖాస్త్రం.!
హైదరాబాద్: ఓ పక్క ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించి, సీఎం చంద్రశేఖర్ రావు పైన కత్తులు నూరుతున్న టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన సొంతపార్టీలోనే అసమ్మతి తారా స్థాయికి చేరింది. ఇంటి పంచాయితీ ఢిల్లీ వరకూ పాకింది. రేవంత్ రెడ్డి పీసిసి ఛీఫ్ గా అందరిని కలుపుకుని వెళ్లడం లేదని, రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చండి లేదా కొత్త పీసిసి అధ్యక్షుడిని నియమించండంటూ ఏకంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాసారు. కాంగ్రెస్ పార్టీలో ఇదే అంశం సంచలనంగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. రేవంత్ పై లేఖాస్త్రం సంధించిన జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుండీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోని సీనియర్ నాయకులకు ప్రాముఖ్యత ఇవ్వడంలేదని, రేవంత్ దూకుడు స్వభావం పార్టీకి నష్టం చేస్తుంది తప్ప లాభం చేయదని సోనియా, రాహుల్ గాంధీకి రాసిన లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు వేల ఓట్లు రావడం రేవంత్ రెడ్డి వైఫల్యమేనని పరోక్షంగా మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించకుండా ఇష్టానుసారం వ్యవహరించారని లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు.
అన్నీ ఏకపక్ష నిర్ణయాలే.. రేవంత్ రెడ్డి పై సోనియాకు ఫిర్యదు చేసిన జగ్గారెడ్డి
తాజాగా సీఎం చంద్రశేఖర్ రావు ఫాం హౌస్ గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండకు సంబందించిన కార్యక్రమం గురించి తనను ఏమాత్రం సంప్రదించకపోవడం విచారకరమని అన్నారు. అంతే కాకుండా పార్టీలో ఏ ఒక్క సీనియర్ నాయకులకు పార్టీ కార్యక్రమాల గురించి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనివల్ల పార్టీకి ఎంతో నష్టమని లేఖలో జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్ వ్యవహారం గురించి గతంలో మాట్లాడితే తనను తప్పుబట్టారని తెలిపారు. కాని పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు అధిష్టానానికి తెలిపేక్రమంలోనే లేఖ రాస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు.
పార్టీ సిద్దాంతాలకు భంగం.. రేవంత్ పార్టీని కార్పోరేట్ వ్యవస్థగా మార్చారన్న జగ్గన్న
ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ,రాహుల్ గాంధీల సిద్దాంతాల కాంగ్రెస్ పార్టీ గా కొనసాగడం లేదని, ఇది ఒక కార్పొరేట్ పార్టీ ఆఫీస్ గా వ్యవహారం నడుస్తోందని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఏక పక్షవ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతుందని, మేడం సోనియా, రాహుల్ గాంధీ ఈ అంశాన్ని గమనించాలని సూచంచారు. రేవంత్ వ్యవహారంపై విచారణ జరిపించాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటే తమలాంటి రాజకీయ నాయకులకు నైతిక స్థైర్యం ఉంటుందని,మరణం వరకూ కాంగ్రెస్ పార్టాతోనే బ్రతుకుతామని అన్నారు.
మైండ్ సెట్ చేయండి.. లేదా మనిషినే మార్చండి.. సోనియాకు జగ్గారెడ్డి లేఖ
ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డితో పార్టీలో ఉండే సీనియర్ నాయకులకు ఎవ్వరికీ సఖ్యత లేదని, అంతే కాకుండా గెలుస్తామని భరోసా ఉన్న బలమైన నాయకులకు కూడా రేవంత్ రెడ్డితో ఎలాంటి సత్సంబందాలు లేవని ఘాటు ఆరోపణలు చేసారు. ఇలాంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ కి ప్రమాదకరమని, ఇది పార్టీ నాయకులకు కూడా ప్రమాదమేనని లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. తన వ్యవహారంతో పార్టీకి మరింత నస్టం జరగకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చాలని, లేదా పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని సంచలన అంశాలను లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు.