రేషన్, పింఛను కోతే: విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్రపాలి హెచ్చరిక
వరంగల్: తమ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ఆమె బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్రపాలి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
రెండు వారాల్లో జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరికీ ఓ పరీక్ష పెడతామని, దాంట్లో ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో చూసి గుర్తిస్తామని అన్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెలా ఒక రోజు తప్పనిసరిగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ను కలవాలన్నారు. ఎవరైతే రెండు నెలలు రారో వాళ్లకు రేషన్, పింఛను కోత విధిస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు.
బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ అమ్రపాలి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు.