సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం: విజయశాంతి, కేసీఆర్ కుమార్తెపై దామోదర
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత మాజీ ఎంపీ విజయశాంతి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతున్న సెక్షన్ 8పై ఆమె స్పందించడం విశేషం. సెక్షన్ 8 అమలు చేయడమంటే, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమేనని అన్నారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని పరోక్షంగా ఎన్టీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
కవిత కేంద్రమంత్రి అయితేనే సంపూర్ణ తెలంగాణ వచ్చినట్టా?:మాజీ డిప్యూటీ సీఎం దామోదర
నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత కేంద్ర మంత్రి అయితేనే సీఎం కేసీఆర్కు సంపూర్ణ తెలంగాణ వచ్చినట్టా? అని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. తెలంగాణకు ఇంకా పూర్తి స్వాతంత్ర్యం రాలేదని, రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదని పలువురు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు.
మంగళవారం ఆయన మెదక్లో మాట్లాడుతూ తెలంగాణ రాకపోతే టీఆర్ఎస్ నేతలు ఎక్కడ అధికారం వెలగబెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ సమస్యల్ని టీఆర్ఎస్ నేతలు ప్రజాసమస్యలుగా చిత్రీకరించి, కొత్త సమస్యలు తెస్తున్నారని అన్నారు.