దేవిది హత్యకాదు కానీ, తండ్రికి భరత్తో కనిపించవద్దని: ఇదీ జరిగింది..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్డులో గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బిటెక్ విద్యార్థిని దేవిది హత్యకాదని హైదరాబాద్ నగర పోలీసులు తేల్చారు. దీని గురించిన పూర్తి వివరాలను నగర పోలీస్ కమిషనర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. అయితే, ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
వాచ్మెన్ రాము కొన్ని సాక్ష్యాలు అందించాడు
వాచ్మెన్గా పని చేస్తున్న రాములు అనే వ్యక్తి తాను ఆ సంఘటనను చూసినట్లు చెప్పాడు. అమ్మాయి సహాయం కోసం అర్థించినట్లు అతను గుర్తించాడు. వాచ్మెన్ రాములు కొన్ని సాక్ష్యాలు అందించాడు.
రాములు వాంగ్మూలం అనంతరం దేవి మృతిపై అనుమానాలు కలిగాయి. దేవి మృతి పైన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
కారులో దేవి, భరతసింహా రెడ్డితో పాటు మరొకరు ఉన్నారని, కారు తొలుత పాడు కాలేదని, అమ్మాయి చెప్పులు ఎలా వచ్చాయని.. ఎలా ఎన్నో అనుమానాలను బంధువులు లేవనెత్తారు. లైంగిక దాడి జరిగినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి.
ఏసీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాం. తాము అన్ని సాక్ష్యాధారాలు సేకరించామని, వాటి ద్వారా ముందుకు వెళ్లాం. వాటిని తాము ప్రజలందరికీ చెప్పాలనుకున్నాం.
ఆధారాలు సేకరించాం
పబ్కు ఎవరెవరు వెళ్లారు, పబ్ నుంచి తిరిగి ఎవరెవరు, ఎలాంటి పరిస్థితుల్లో బయలుదేరారు, ఎవరెవరు కలిసి వెళ్లారు, ఎవరెవరు విడిగా వెళ్లారనే విషయం తెలుసుకునేందుకు కాల్ డేటాను సేకరించాం. సంఘటన ఎక్కడ జరిగిందనేది తెలుసుకునేందుకు కూడా సాక్ష్యాలు సేకరించాం.
దేవికి జరిగిన గాయాలు ప్రమాదం వల్ల జరిగినవా లేక ఎవరైనా గాయపరిస్తే జరిగాయా తెలుసుకునేందుకు తాము వైద్యుల సహకారం తీసుకున్నాం. తాము మెడికల్, ఫోరోన్సిక్.. తదితర అందరి సహకారంతో విచారణ చేశాం. సీసీటీవీ ఫుటేజీలు కూడా సేకరించాం.
దేవి, భరతసింహా రెడ్డిలు ఏ దారిలో వెళ్లారో కూడా తెలుసుకున్నాం. తాము మెడికల్, టెక్నికల్.. ఇలా అన్ని రకాల ఆధారాలు సేకరించాం.
వారం క్రితమే ప్లాన్
పబ్కు వెళ్లేందుకు భరతసింహా రెడ్డి తదితరులు వారం క్రితమే ప్లాన్ చేసుకున్నారు. స్నేహితులతో పబ్కు వెళ్లాలని నిర్ణయించుకున్న భరతసింహా రెడ్డి.. దేవికి చెప్పాడు. ఎవరైనా అమ్మాయిలు వస్తే తాను వస్తానని దేవి చెప్పారు. తాను సోనాలితో కలిసి పబ్ వెళ్తానని దేవీ తండ్రికి చెప్పింది. ఆ తర్వాత దేవి తన తండ్రిని అడిగి సోనాలి ఇంటికి వెళ్లింది.
దేవి, సోనాలి కలిసి పబ్కు వెళ్లాలని, అక్కడి నుంచి సోనాలి.. దేవిని ఇంటి వద్ద దించాలని ముందుగానే మాట్లాడుకున్నారని పోలీస్ కమిషనర్ వివరించారు. భరతసింహా రెడ్డి అయ్యప్ప సొసైటీలో ఉంటారు. దేవి జర్నలిస్ట్ కాలనీలో ఉంటుంది. సోనాలి మరోచోట ఉంటుంది. ముగ్గురు ఉండేది వేర్వేరు చోట.
సోనాలీ, దేవీ కలిసి వెళ్లారని మాత్రమే తెలుసు
పబ్కు సోనాలి, దేవి మాత్రమే వెళ్తుందని దేవి తండ్రికి తెలుసు. భరతసింహా రెడ్డి వారి వెంట వెళ్తాడనే విషయం దేవి తండ్రికి తెలియదు. దేవి, భరతసింహా రెడ్డి, సోనాలి కలిసి పబ్ బయలుదేరారు. ఆ తర్వాత వీరు విశ్వనాథ్ అనే మరో స్నేహితుడిని పికప్ చేసుకొని పబ్కు వెళ్లారు.
వారు పబ్కు చేరుకునేసరికి రాత్రి పదిన్నర అయింది. మరో స్నేహితుడు పృథ్వీ ఒక్కడే వచ్చాడని, వీరంతా స్నేహితులు. ఆ తర్వాత సోనాలీ, తన కజిన్తో కలిసి లోపలకు వెళ్లింది. మిగతా వాళ్లంతా కలిసి జట్టుగా వెళ్లారు. మందు వేశారు.
రాత్రి ఒకటి గంటలకు తండ్రి నుంచి దేవికి ఫోన్ వచ్చింది. తనను సోనాలీ డ్రాప్ చేస్తుందని తల్లిదండ్రులకు దేవి చెప్పింది. తల్లిదండ్రులు రాత్రి ఒకటి గంటల నుంచి మూడున్నర గంటల దాకా ఫోన్ చేశారు. అయితే, తనను సోనాలీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తుందని దేవి పలుమార్లు చెప్పింది.
ఆ తర్వాత అందరూ పబ్ నుంచి బయటకు వచ్చారు. దేవీని చూసిన సోనాలీ.. నేను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పింది. దానికి దేవీ స్నేహితులతో వెళ్తానని చెప్పింది.
పబ్ వద్ద కార్ల పార్కింగ్ ఆలస్యం కావడంతో.. మూడున్నర గంటల వరకు పబ్ వద్దే ఉన్నారు. ఆ తర్వాత మూడున్నర గంటలకు మరోసారి తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. తాను పది నిమిషాల్లో వస్తానని చెప్పింది.
భరతసింహా రెడ్డి, దేవిలు ఓ కారులో, మరికొందరు స్నేహితులు మరో కారులో బయలుదేరారు. ఆ తర్వాత స్నేహితుల కారు ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయింది. భరతసింహా రెడ్డి, దేవిలు ఓ కారులో వెళ్తున్నారు.
14 నిమిషాల్లో పది కిలోమీటర్ల ప్రయాణం
వారు, జర్నలిస్ట్ కాలనీకి కారులో వచ్చారు. పబ్ నుంచి పది నిమిషాల్లో 14 కిలోమీటర్లు ప్రయాణించారు. వారు 90 కిలోమీటర్ల వరకు వేగంతో వచ్చారు.
ఆంధ్రజ్యోతి ఆఫీస్ వరకు చేరుకున్నాక.. దేవీకి తండ్రి నుంచి మరోసారి ఫోన్ వచ్చింది. అయితే, తాను సోనాలీతో వస్తానని దేవీ తండ్రికి చెప్పింది. భరతసింహా రెడ్డితో వచ్చే విషయం తెలియదు.
దీంతో, సోనాలీతో వస్తున్నానని తండ్రికి చెప్పేందుకు కాన్ఫరెన్స్ కలిపేందుకు దేవీ ప్రయత్నించింది. ఎందుకంటే, ఆ పక్కనే కొద్ది దూరంలో దేవీ ఇల్లు ఉంది. భరతసింహా రెడ్డితో తాను వస్తున్నానని తండ్రికి తెలియకుండా ఉండేందుకు ఆమె ప్రయత్నించింది. కాన్ఫరెన్స్ కాల్ కలవలేదు.
ఆ తర్వాత నేను వస్తానని, ఎక్కడున్నావో చెప్పమని దేవీ తండ్రి ఆమెను అడిగాడు. 3.50కి తండ్రి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత 3.58కి ప్రమాదం జరిగింది. భరత్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్లో స్టీరింగ్ బాగా తిప్పడంతో కారు 180 డిగ్రీలు హఠాత్తుగా తిరిగి చెట్టుకు తగిలి ప్రమాదం జరిగింది. ఆమె తలకు గాయమై చనిపోయింది.
ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కానీ, ఇద్దరు కూడా సీటు బెల్టు పెట్టుకోలేదు. సీటు బెల్టు లేకపోవడం వల్ల, దేవీ కారు మధ్యలో కూర్చోవడం వల్ల గాయాలయ్యాయి. ఆమెకు పలుచోట్ల గాయాలయ్యాయి. 3.58కి ప్రమాదం జరిగింది.
అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ కారు.. అదే లైన్కు వెళ్లింది. ఉదయం గం.4.10 సమయంలో పెట్రోలింగ్ పోలీసులకు అరుపులు వినిపించాయి. ఓ వ్యక్తి నుంచి 'దేవీ దేవీ' అని అరుస్తున్నాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
ప్రమాదం జరిగిందని, ఎవరూ సహాయం చేసేందుకు రావడం లేదని భరతసింహా రెడ్డి పెట్రోలింగ్ పోలీసులకు చెప్పారు. పక్కనే ఉన్న వాచ్మెన్ రాములు, ఇతరుల సహాయంతో కారులో ఇరుక్కున్న దేవిని బయటకు తీశారు. ఆ సమయంలో ఆమె చెప్పులు కాళ్లకే ఉన్నాయి. ఫోన్ మాత్రం ఎక్కడో పడిపోయింది.
ప్రమాదం గురించి తెలిసిన భరతసింహా రెడ్డి తల్లిదండ్రులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చారు. వారు భరతసింహా రెడ్డిని ఉదయం గం.4.30 సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు.
కానీ మృతికి భరతసింహా రెడ్డి బాధ్యుడు
దేవిని ఎక్కడైన హత్య చేసి, లైంగిక వేధింపులకు గురి చేసి తీసుకు వచ్చారా అనే కోణంలో తాము విచారణ జరిపామన్నారు. దేవికి ఉన్న గాయాలు ప్రమాదం ద్వారా జరిగినవేనని తేలిందని చెప్పారు. అదేవిధంగా అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరగలేదని తేలిందన్నారు.
అయితే, భరత్ తాగిన మైకంలో ఉన్నాడన్నారు. దేవిని సేఫ్గా తీసుకు రావాల్సిన బాధ్యత మాత్రం భరతసింహా రెడ్డిదే అన్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం, వేగంగా నడపడం తప్పు అన్నారు. తాగి, వేగంగా నడిపి దేవీ మృతికి భరతసింహా రెడ్డి కారణమయ్యాడని తెలిపారు. కాబట్టి ఆ సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశామన్నారు.