ఎంసెట్ స్కామ్లో పేరెంట్స్ తెలివి: బ్రోకర్లకే దిమ్మతిరిగే షాక్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. తాము ఒప్పుకున్న మేరకు డబ్బులు చెల్లించడానికి తమ సర్టిఫికెట్లను బ్రోకర్లకు కుదవపెట్టినట్లు వెలుగు చూసింది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లకే షాక్ ఇచ్చారు.
ప్రశ్నాపత్రాన్ని లీక్చేసి తమకు ఇచ్చేందుకుగాను భారీ మొత్తంలో నగదు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో అంగీకారానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం కొంతమంది ముందుగా రూ.35 లక్షల చొప్పున చెల్లించారు. మరికొందరు ర్యాంకులు వచ్చిన తరువాత డబ్బు చెల్లిస్తామని చెప్పారు.
దానికి హామీగా విద్యార్థులు తమ సర్టిఫికెట్లను బ్రోకర్ల వద్ద కుదువ పెట్టారు. రమేశ్ అనే బ్రోకర్ వద్ద ఐదుగురు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టినట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. పథకం ప్రకారమే లీకేజీ ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్థులు పరీక్ష పాసై ర్యాంకు సాధించినప్పటికీ బ్రోకర్కు మాత్రం డబ్బు చెల్లించేందుకు నిరాకరించారు.
తనవద్దనున్న ఒరిజినల్ సర్టిఫికెట్ల గురించి ప్రస్తావించి, బెదిరించడానికి ప్రయత్నించిన రమేశ్పైకి విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారు. తాము ఒక్క రూపాయి కూడా చెల్లిం చం, సర్టిఫికెట్లు కాల్చేసుకుంటావా..కాల్చేసుకో అంటూ వారు చెప్పినట్లు తెలుస్తోంది.
వారి ధైర్యం ఏమిటా అని ఆరా తీయగా తనకు వారు ఇచ్చిన సర్టిఫికెట్లు కలర్ జిరాక్స్ విత్ లామినేషన్ అన్న విషయం బయటపడింది. దీనితో కంగుతిన్న రమేశ్ విద్యార్థుల తల్లిదండ్రులను డబ్బుల విషయంలో బతిమిలాడుకున్నట్టు సీఐడీ విచారణలో బయటపడింది.