దళితులపై కేసీఆర్కు నిజంగా ప్రేమ ఉంటే... ఆ పని చేసి చూపించాలి... ఈటల రాజేందర్ సవాల్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్కు నిజంగా దళితులపై ప్రేమ,వారు అభివృద్ది చెందాలన్న కాంక్ష ఉంటే... ఈ ఏడేళ్లలో ఆ జాతి ఎంతగానో అభివృద్ది చెందేదన్నారు. కేవలం తూతూ మంత్రంగా దళితుల కోసం పనిచేయడమే తప్పితే... కడుపునిండా ఆ జాతిని ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. దళితుల అభివృద్దికి ప్రత్యేక పథకాలేమీ చేపట్టకపోగా ఈ ఏడేళ్లలో కేసీఆర్ దళిత జాతిని అవమానించారని ఈటల ఆరోపించారు.
దళితులపై నిజంగా ప్రేమ ఉంటే... : ఈటల
దళిత ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు ఉపముఖ్యమంత్రి పదవిలోనూ దళిత నేతను ఎక్కువ రోజులు కొనసాగించలేదని ఈటల అన్నారు. దళితులకు పాలనా నైపుణ్యం లేదని చెప్పేందుకే కేసీఆర్ అప్పట్లో రాజయ్యను ఆ పదవి నుంచి తొలగించారన్నారు.
కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రిగా ఎంత స్వేచ్చగా పనిచేశారో ఆయనకు తెలుసన్నారు.రాష్ట్రంలో 18 శాతం పైచిలుకు ఉన్న దళిత జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. కేసీఆర్కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే.. జనాభా ప్రాతిపదికన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
దళిత ఐఏఎస్లను అవమానించారు...: ఈటల
సీఎంవో కార్యాలయంలో మనది అన్న విశ్వాసం ఏర్పడాలంటే అందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ ఐఏఎస్ అధికారులకు చోటు కల్పించాలని గతంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.కానీ ఆ జాతుల నుంచి వచ్చినవారికి ప్రతిభ లేదని కేసీఆర్ వారిని అవమానపరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆకునూరి మురళి అనే ఐఏఎస్ అధికారికి కనీసం కారు కూడా కేటాయించలేదని... ప్రాధాన్యత లేని పోస్టులో ఆయన్ను పడేస్తే రాజీనామా చేశారని అన్నారు. సీఎస్గా పనిచేసిన ఐఏఎస్ ప్రదీప్ చంద్ర రిటైర్మెంట్ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదని గుర్తుచేశారు. ఇవన్నీ దళిత జాతిని అవమానించడమేనని అన్నారు.
దళితుల మళ్లీ దొరల కాళ్ల మీద పడే పరిస్థితి తెచ్చారు : ఈటల
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి ట్యాంక్ బండ్పై విగ్రహాల కోసం,సిమెంట్ రోడ్ల కోసం,సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఏడేళ్ల కాలంలో దళితుల కోసం కనీసం రూ.1వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా అని ప్రశ్నించారు. కొంతమంది బానిసలు మొరుగుతుండొచ్చునని... కానీ ఏ జాతి వల్ల వారికి గౌరవం లభించిందో... ఆ జాతి నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయవద్దని అన్నారు.
రెవెన్యూ సంస్కరణలతో దళితులు మళ్లీ దొరల కాళ్ల మీద పడి భూములు దక్కించుకోవాల్సిన స్థితి తలెత్తిందని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు... ఇలా ఎందులోనూ న్యాయం జరగలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవడమే టీఆర్ఎస్కు తెలుసునని విమర్శించారు.