టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కేటీఆర్తో భేటీ: కీలక బాధ్యతలు!
హైదరాబాద్: మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన శుక్రవారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో భేటీ అయ్యారు.
కేసీఆర్ మరో సంచలనం, 105 మంది అభ్యర్థుల ప్రకటన, వారికి మాత్రమే నో టిక్కెట్
అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్కు మరోసారి తెరలేపారు. ఇందులో భాగంగా కేటీఆర్తో సురేష్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)తోను కేటీఆర్ భేటీ అయ్యారు.
మరోవైపు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కలిశారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. చెన్నూరు నుంచి ఈసారి ఎంపీ బాల్కసుమన్ బరిలోకి దిగుతున్నారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై ఓదేలు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా కేసీఆర్ను కలిశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
టీఆర్ఎస్లో పలువురికి టిక్కెట్లు ఇవ్వలేదు. 119 నియోజకవర్గాల్లో చాలామంది టిక్కెట్లు అడుగుతున్నారని కేసీఆర్ గురువారం ప్రెస్ మీట్ సందర్భంగానే చెప్పారు. 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, అందరికీ టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా చేయలేమని, టిక్కెట్ రాని వారి బాధ మేం చూసుకుంటామని చెప్పారు.