కెసిఆర్పై విహెచ్ భగ్గు, 'కరణం బలరాం-రోజా సస్పెన్షన్లకు పోలిక లేదా'
హైదరాబాద్: బిసి వారికి క్రిమిలేయర్ నిబంధనలను రూ.6 లక్షలుగా పేర్కొనడంపై తెలంగాణ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఆదివారం నాడు మండిపడ్డారు. క్రిమిలేయర్ వర్తింపు సరికాదన్నారు.
పైగా, రూ.6 లక్షలకు క్రిమిలేయర్ వర్తింది సరికాదని, దీనిపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ను పదిహేను లక్షలకు పెంచాలని తాము కేంద్రాన్ని కోరినట్లు విహెచ్ చెప్పారు. బిసి కమిషన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసిందన్నారు.
త్వరలో బిసి సంఘాలతో కలిసి దీనిపై ఉద్యమిస్తామన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని త్వరలో కలుస్తామని విహెచ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రోజా సస్పెన్షన్ పై మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి
వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ నిబంధనలకు అనుగుణంగానే జరిగినప్పటికీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మాత్రం విరుద్ధమేనని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను స్పీకర్గా ఉన్న సమయంలో చేబట్టిన కరణం బలరాం సస్పెన్షన్కు, తాజాగా జరిగిన రోజా సస్పెషన్కు సంబంధం లేదన్నారు.
ఆనాడు కరణం బలరాం స్పీకర్ పైన సభ వెలుపల వ్యాఖ్యలు చేశారని, తనపై అభియోగాలకు సభాపతి సమాధానం చెప్పుకోలేడు కాబట్టి, అది తీవ్రమైన అంశమేనన్నారు. అప్పట్లో ఎథిక్స్ కమిటీ అన్ని విషయాలనూ పరిశీలించిన మీదటే బలరాం సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందన్నారు. నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ సభా నిర్ణయమే ఫైనల్ అన్నారు.