ఉత్తమ్! రాజీనామా చేస్తారా?, ఊహించని మెజార్టీ: హరీశ్, కానుకగా ఇవ్వండన్న దయాకర్
వరంగల్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఊహించని మెజార్టీ వస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉప ఎన్నికలో భాగంగా దేశాయిపేటలో మంత్రి హరీష్రావు సోమవారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉనికి కోసమే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని ధ్వజమెత్తారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక కాంగ్రెస్, బిజెపిలు అరువు తెచ్చుకున్నాయని విమర్శించారు. బిజెపి ఎన్ఐఆర్ని దిగుమతి చేసుకుంటే, కాంగ్రెస్ ఆపధర్మ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణను బరిలోకి దింపిందన్నారు.
తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని అసెంబ్లీలో కిరణ్కుమార్రెడ్డి అన్నప్పుడు నేటి కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వారికి వరంగల్లో ఓట్లు అడిగే నైతికత లేదన్నారు.
వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే తన పదవికి రాజీనామా చేస్తారా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని అడిగారు. హరీష్రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, గుండు సుధారాణి, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు ఉన్నారు.
నన్ను సీఎంకు కానుకగా ఇవ్వండి: దయాకర్
స్థానికుడైన తనను గెలిపించి ముఖ్యమంత్రి కెసిఆర్కు కానుకగా ఇవ్వండని వరంగల్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు వరంగల్లో ఏవరూ అభ్యర్థులు లేరనట్టు అమెరికా, హైదరాబాద్ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకున్నారని ఎద్దెవా చేశారు. ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ టిఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.