హైదరాబాద్ మెట్రో మరింత ఆలస్యం: 2018 డిసెంబర్ నాటికి చివరి దశ
హైదరాబాద్: భాగ్యనగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు నిర్ణీత సమయంలోగా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కనీసం మరో ఏడాదిన్నర పట్టే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కనీసం రెండు కారిడార్లలో ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించడం లేదు.
నాగోల్ - సికింద్రాబాద్, మియాపూర్ - ఎస్సార్ నగర్ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఫలితం కనిపించడం లేదు. మెట్రో ఇప్పుడే కాదని, జూన్ 2న తొలిదశ ప్రారంభం అసాధ్యమని, 2018 డిసెంబర్ నాటికి చివరి దశ పూర్తి అవుతుందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ నూతన చైర్మన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు.
తొలి దశ ప్రారంభం జూన్ 2న ఉండదని, ఎప్పుడనే దానిపై ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయన్నారు. సాంకేతికంగా తాము సిద్ధంగా ఉన్నా విద్యుత్తు, భద్రత, టికెటింగ్ వంటి సమస్యలు కొన్ని ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకమంత్రి కేటీఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తున్నారన్నారు.
సుల్తాన్ బజార్ మెట్రో ఉత్కంఠకు తెర: 'పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో రైలు'
హైదరాబాద్ మెట్రో రైలు నూతన ఎండీగా శివానంద్ నింబర్గి నియామకాన్ని ప్రకటించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యన్ మాట్లాడారు. చివరిదశ పనులు 2018 డిసెంబరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు.
2017 జులై 4 వరకు పనులు పూర్తిచేయాలనేది ఒప్పందమని, గడువు పొడిగింపుపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. నిజానికిది జాప్యం కాదని, భూసేకరణ, ఇరుకుదారులు వంటి సవాళ్ల కారణంగా గడువు లోపు పూర్తికావడం లేదన్నారు. ఏ కారణంగా ఆలస్యం జరిగినా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందన్నారు.
నిర్మాణ వ్యయం సహజంగానే పెరుగుతుందన్నారు. ఇప్పటికే రూ.3వేల కోట్ల భారం తమపై పడిందని, దీనిని ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఏం చేస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ ఇప్పటి వరకు రూ.11వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. వాస్తవానికి రూ.14,132 కోట్లతో ఈ ప్రాజెక్టు 2015 జనవరి నాటికి పూర్తి కావాల్సి ఉంది. 2010లో ఎల్ అండ్ టీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఇతర నగరాల్లోని మెట్రో ప్రాజెక్ట్లన్నింటి కంటే వేగంగా పనులను చేశామని మెట్రో రైలు ప్రస్తుత ఎండీ విబి గాడ్గిల్ అన్నారు. తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో పూర్తి చేయకుండా వైదొలుగుతున్న ప్రాజెక్ట్ ఇది కావడంతో ఎంతో బాధగా ఉందన్నారు. ఐదేళ్లలో పూర్తి కావాల్సిన పనుల్లో వేర్వేరు కారణాలతో జాప్యం జరిగిందన్నారు.