హైదరాబాద్ ఐటీ కారిడార్కు ఉగ్ర ముప్పు: నగరంలో హైఅలర్ట్, ముమ్మర తనిఖీలు..
వీకెండ్ కావడంతో ఐటీ కారిడార్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఉగ్రవాదులు మాదాపూర్ మాల్స్ను టార్గెట్ చేశారని తెలుస్తోంది.
హైదరాబాద్: నగరంలో ఉగ్ర హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. ఐటీ కారిడార్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ ను ఉగ్రవాదులు టార్గెట్గా ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో.. మాల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
లోపలికి వెళ్లే ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మాల్ లోకి పంపిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్ర హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నగరంలోని షాపింగ్ మాల్స్ అన్నింటిని పోలీసులు అప్రమత్తం చేశారు. ఒకరకంగా నగరమంతా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది.
వీకెండ్ కావడంతో ఐటీ కారిడార్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఉగ్రవాదులు మాదాపూర్ మాల్స్ను టార్గెట్ చేశారని తెలుస్తోంది. రంజాన్ మాసంలో ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐటీ కారిడార్ అడుగడుగునా పోలీస్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
బ్యాగ్స్, ఇతరత్రా వస్తువులేమైనా ఉంటే.. వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం అలర్ట్ చేసిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపనున్నారు. అనుమానితులపై నిఘా కూడా పెట్టినట్లు తెలుస్తోంది.