ఆగిన పట్టాభిషేకం: నాన్న చెప్తే కెటిఆర్, కవిత విన్నారు?
కెటిఆర్కు పట్టాభిషేకం చేద్దామనే ఆలోచనను కెసిఆర్ తాజాగా విరమించుకున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. నాన్న చెప్తే వారిద్దరు విని, ఆలా చెప్పారని అంటున్నారు.
హైదరాబాద్: తన వారసుడిగా కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావును ముందుకు తేవాలనే ఆలోచనను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కన పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ప్లీనరీలో కెటిఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది.
అలా ప్రచారం జరగడానికి ప్రధాన కారణం కెటిఆర్ వ్యవహార శైలియే. జనహిహత ప్రగతి సభలను ఏర్పాటు చేస్తూ జిల్లాల్లో కెటిఆర్ విస్తృతంగా పర్యటించడంలోని ఆంతర్యం అదేనని అంటున్నారు. ఆ సభల్లో కెటిఆర్ మాట్లాడిన తీరు కూడా కెసిఆర్ వారసుడిని తానే అన్నట్లు ఉంది.
దానికితోడు, జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా కీలకమైన సంఘటన చేసుకుంది. కలెక్టర్ల సమావేశం సందర్భంగా కెటిఆర్ జిల్లా కలెక్టర్లతో గ్రూప్ ఫొటో దిగిన సంఘటన అది. ముఖ్యమంత్రితో కలెక్టర్లు గ్రూప్ ఫొటో దిగడం ఆనవాయితీ. లేదంటే, రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో దిగాలి. మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా ఉన్నారు.
కెటిఆర్ కలెక్టర్లతో అలా...
కెటిఆర్ జిల్లా కలెక్టర్లతో గ్రూప్ ఫొటో దిగడానికి కెసిఆర్ అనుమతి ఉందని అంటన్నారు. తన వారసుడిగా కెటిఆర్ను ముందుకు తెస్తున్నట్లు తగిన సంకేతాలను ఇవ్వడమే అందులోని ఉద్దేశంగా ప్రచారం జరిగింది. ఈ గ్రూప్ ఫొటోలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ప్రముఖ అధికారి స్మిత సబర్వాల్ కూడా ఉండడం విశేషం. కెసిఆర్ తలుచుకోకపోతే అలాంటి గ్రూప్ ఫొటో ఉండదనేది అందరికీ తెలిసిందే.
హరీష్ ఏమన్నారు...
తాను కెసిఆర్ ఏది చేస్తే అది చేస్తానని హరీష్ రావు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. తెరాస నాయకత్వంపై కెసిఆర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. దాంతో కెటిఆర్కు ప్రమోషన్ ఇవ్వడానికి హరీష్ రావు అంగీకరించారనే ప్రచారం జరిగింది. నిజానికి, కెటిఆర్ను ప్రమోట్ చేస్తే హరీష్ రావు తిరుగుబాటు చేస్తారనే వ్యాఖ్యలు ప్రతిపక్షాల నుంచి విరివిగా వచ్చాయి. అంతేకాకుండా హరీష్ రావు కాంగ్రెసులో చేరుతారనే మాటలు కూడా అక్కడి నుంచి వచ్చాయి.
కెటిఆర్ తర్వాత ఇలా....
తాను నాయకత్వ బాధ్యతలను చేపట్టబోతున్నట్లు తన వ్యవహార శైలి ద్వారా, మాటల ద్వారా సంకేతాలు ఇస్తూ వచ్చిన కెటిఆర్ ఆ తర్వాత మాట మార్చారు. మరో పదేళ్ల పాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని కూడా స్పష్టం చేశారు. హరీష్ రావుకు, తనకు మధ్య ఏ విధమైన విభేదాలు లేవని కూడా చెప్పారు.
కల్వకుంట్ల కవిత ఆ తర్వాత ఇలా...
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సభలో కెటిఆర్కు నాయకత్వం అప్పగిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చిన కెసిఆర్ కూతురు, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆ తర్వాత మరో రకంగా మాట్లాడారు. తెరాసలో నెంబర్ 2 ఎవరూ ఉండరని ఆమె అన్నారు. నెంబర్ 1 నుంచి నెంబర్ 1000 వరకు కెసిఆర్ మాత్రమేనని ఆమె అన్నారు.
వారు అలా మార్చడం వెనక...
కెటిఆర్కు పట్టాభిషేకం చేద్దామని భావించిన కెసిఆర్ తన ఆలోచనను విరమించుకున్నట్లు కెటిఆర్, కవితల తాజా ప్రకటనల నేపథ్యంలో ప్రచారం సాగుతోంది. కెసిఆర్ చెప్పడం వల్లనే వారిద్దరు ఆ రకమైన ప్రకటనలు చేశారని అంటున్నారు. తన ఆలోచన నుంచి కెసిఆర్ వెనక్కి తగ్గడం వెనక కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ, ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా హరీష్ రావు తీవ్రమైన ఆసంతృప్తి వ్యక్తం చేసైనా ఉండవచ్చు.